సంతగుడిపాడులో వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల

YS Jagan Sanctioned Veterinary Polytechnic College in Santhagudipadu - Sakshi

10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం

ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 

రొంపిచర్ల(పల్నాడు జిల్లా): మండలంలోని సంతగుడిపాడు గ్రామంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతి మంజూరు చేశారని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంతగుడిపాడు గ్రామంలో గురువారం దేవాలయ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. 

నాడు నేడు రెండవ ఫేజ్‌లో భాగంగా కోటి ఐదు లక్షల రూపాయల నిధులతో 9 తరగతి గదులు నిర్మించనున్నట్లు తెలిపారు. విద్యకు ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతతో 320 విద్యార్థులు ఉన్న హైస్కూల్‌లో ఈ ఏడాది 700 మంది విద్యార్థులు చేరారన్నారు. తరగతి గదులు రానున్న వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తవుతుందన్నారు. 

అలాగే ఐదు ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిల్లి ఓబుల్‌రెడ్డి, ఎంపీటీసీ ఇరుగుల మాధవి, సర్పంచ్‌ ఉయ్యాల సీతమ్మ, మాజీ సర్పంచ్‌ పల్లకి అంజనారెడ్డి, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పచ్చవ రవీంద్రబాబు, ఏలేశ్వరరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top