
చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా.. అన్నదెవరు?
అమ్మాయి కన్పిస్తే వెళ్లి ముద్దైనా పెట్టాలి.. కడుపైనా చేయాలని అనిందెవరు?
అమ్మాయిలతో అసభ్య నృత్యాలు చేసిందెవరు?
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను ఎత్తిచూపుతూ.. మహిళలపై గతంలో చంద్రబాబు, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, లోకేశ్ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోలను జత చేస్తూ.. వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడేదంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మహిళల గౌరవం కాపాడటం’ అనే ముసుగులో కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై చేస్తున్న దాడులను, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టును ఖండిస్తూ ‘ఎక్స్’లో మంగళవారం ఆయన పోస్టు చేశారు. అందులో ఏం చెప్పారంటే..
అది రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్టు
‘పారదర్శకత, అవినీతి రహిత, న్యాయబద్ధమైన, విప్లవాత్మక సంక్షేమ పథకాలతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా పాలన చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలన మోసాలతోనే కొనసాగింది. రెడ్ బుక్తో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ నిరంకుశ పాలన సాగుతోంది. తన గొప్ప వాగ్దానాలను అమలు చేయలేని అసమర్థతతో ప్రజలను మోసగించిన చంద్రబాబు.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. ప్రజల దృష్టి మళ్లించేందుకు అలజడి సృష్టిస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎప్పుడూ చేయని వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించి తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయించారు. ఇది చట్టబద్ధంగా జరిగిన అరెస్టు కాదు. రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్టు. ఆయన చర్చను నిష్పక్షపాతంగా నిర్వహిస్తారు.
ఆయన చేయని వ్యాఖ్యలను చంద్రబాబు ప్రభుత్వం వక్రీకరించి కొమ్మినేనిని బాధ్యులుగా చేయడం ఎంత అన్యాయం? వాస్తవాలను వక్రీకరించి ఒక పథకం ప్రకారం మహిళల గౌరవాన్ని కాపాడటం అనే ముసుగులో సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ చంద్రబాబు, అమ్మాయి కన్పిస్తే వెళ్లి ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి.. అంటూ బాలకృష్ణ అన్న మాటలు.. అమ్మాయిలతో లోకేశ్ నృత్యం చేస్తున్న వీడియోలు.. వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడతామని చెప్పేది? ఈ వీడియోలు వారి నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. మహిళల పట్ల వారికి ఉన్న గౌరవాన్ని, విలువను చాటిచెబుతున్నాయి.

హామీ ఇచ్చిన భద్రత ఇదేనా?
రాష్ట్రంలో ఏడాదిలోనే 188 అత్యాచారాలు, 15 అత్యాచార హత్యలు జరగడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. ఇటీవలే అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ గిరిజన విద్యార్థినిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని అడవిలో పడేశారు. ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికను టీడీపీకి చెందిన 14 మంది ఆరు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె గర్భవతి అయింది. తీవ్రమైన రాజకీయ ఒత్తిడి, పోలీసుల నిష్క్రియాపరత్వాల మధ్య ఆ బాధితురాలి కుటుంబం అదృశ్యమైంది. మహిళలకు వారు హామీ ఇచ్చిన భద్రత ఇదేనా? వారు కాపాడిన గౌరవం ఇదేనా? మహిళల పట్ల వారి చర్యలు, వైఖరి రెండూ అవమానకరంగా ఉన్నాయి. మహిళల గౌరవం కాపాడటం ముసుగులో కూటమి నేతలు పగ పెంచుకున్న వారిపై కేసులు నమోదు చేయడం అసహ్యకరం.