సాక్షి, తాడేపల్లి: విజయదుర్గ పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘పీఠాధిపతి మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు. ఆధ్యాత్మిక రంగానికి విశిష్ట సేవలందిస్తూ వేలాది మంది భక్తులకు మార్గదర్శకులుగా నిలిచారు. ధర్మ పరిరక్షణ, సనాతన ఆధ్యాత్మిక విలువల ప్రచారం.. భక్తి మార్గ బోధన కోసం ఆయన జీవితాంతం అంకితభావంతో కృషి చేశారు’’ అని వైఎస్ జగన్ అన్నారు.
‘‘సుబ్రహ్మణ్యం గారి సేవలు, బోధనలు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన మరణం భక్తజనులకు తీవ్ర వేదన కలిగించింది. సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులకు, శిష్యులకు, భక్తులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.



