సౌభాగ్యమ్మ పేరిట ఉన్న భూమి ఇప్పటికీ ఆన్లైన్లో ప్రత్యక్షం
సాక్షి ప్రతినిధి, కడప: తప్పుడు వార్తలు వండివార్చడంలో ‘ఈనాడు’ మరోసారి ముందు వరుసలో నిలిచింది. ‘వివేకా కుటుంబంపై వైకాపా పగ’ కథనమే అందుకు తాజా ఉదాహరణ. ఇప్పటికీ వైఎస్ సౌభాగ్యమ్మ పేరిట ఆన్లైన్లో ఉన్న భూమిని లేనట్లుగా ఎల్లో మీడియా చిత్రీకరించింది. పైగా మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఇతరుల పేరుతో మ్యుటేషన్ చేశారని, అప్పటి తహశీల్దార్ మాధవకృష్ణారెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటూ తప్పుడు ప్రచారానికి తెగబడింది.
పులివెందుల మండలం కె.వెలమవారిపల్లెలో 2006 ఫిబ్రవరి 17న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల సంఖ్య 1577/2006, 1579/2006 ప్రకారం నాలుగు సర్వే నంబర్లలో 7.03 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. సర్వే నంబర్ 351/ఏలో 2.91 ఎకరాలు, 352–ఏలో 4.05 ఎకరాలు, 353/1ఏలో 0.04 సెంట్లు, 354ఏలో 0.03 సెంట్లు కలిపి మొత్తంగా 7.03 ఎకరాలు వైఎస్ సౌభాగ్యమ్మ పేరిట వెబ్ల్యాండ్లో కనిపించడం లేదంటూ ఈనాడు దుష్ప్రచారానికి దిగింది.
టీడీపీ హయాంలోనే ల్యాండ్ కన్వర్షన్..
వైఎస్ సౌభాగ్యమ్మ పేరుతో ఉన్న భూములను ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటూ 2018లో దరఖాస్తు చేసుకున్నారు. ఆమేరకు రూ.65 వేలు చలానా చెల్లించారు. ఆ ఫైలును పరిశీలించిన అప్పటి జమ్మలమడుగు ఆర్డీవో ద్వారా 2018 మార్చి 20న ల్యాండ్ కన్వర్షన్ కూడా అయింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలోనే ల్యాండ్ కన్వర్షన్ చేపట్టారు. ఆమేరకు రెగ్యులర్ ఖాతా 763 నుంచి నోషనల్ ఖాతా నంబర్ 300004కి మారింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీభూమి పోర్టల్లో ఇప్పటికీ వైఎస్ సౌభాగ్యమ్మ పేరిట 1బీ నమోదై ఉంది. 351/ఏలో 3.47 ఎకరాలు పట్టాదారు పేరు తెలియదని వెబ్ ల్యాండ్లో నమోదై ఉంది. వైఎస్ సౌభాగ్యమ్మ భూమి ఇప్పటికీ వారి స్వాధీనంలో, వారి అనుభవంలోనే ఉంది. ఈ విషయమై పులివెందుల తహశీల్దార్ నజీర్ను వివరణ కోరగా.. సౌభాగ్యమ్మ పేరిట ఉన్న భూమి వన్టైమ్ కన్వర్షన్ అయ్యిందని.. కాబట్టే నోషనల్ ఖాతా నంబర్కు బదలాయింపు అయ్యిందని వివరించడం గమనార్హం.


