
సాక్షి,గుంటూరు: రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న చంద్రబాబు అరాచకపాలనపై సుదీర్ఘంగా ప్రెస్మీట్లో మాట్లాడనున్నట్లు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటనలో వైఎస్ జగన్ తెలిపారు.
వైఎస్ జగన్ బుధవారం రెంటపాళ్లలో పర్యటించారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన ఆయన.. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు ఘటనను ప్రస్తావించారు. అంతకు ముందు.. నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అనడానికి కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనమని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోంది. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద రేపు ఉదయం సుదీర్ఘమైన ప్రెస్మీట్ పెట్టి ప్రజలందరికీ వివరించడం జరుగుతుంది.
చంద్రబాబుకి, ఆయనకి వత్తాసు పలుకుతున్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు.. అందరూ కాదు.. కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఒక ఏడాది గడిచిపోయింది. మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తా. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్ బుక్ కారణంగా ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాలను చూసి ప్రతి అధికారికీ ఒకటే చెబుతున్నా, ఈ అన్యాయాలలో మీరు భాగస్వాములు కావొద్దు. భాగస్వాములైతే చంద్రబాబుతోపాటు మిమ్మల్ని కూడా బోను ఎక్కించే కార్యక్రమం చేస్తానని వైఎస్ జగన్ హెచ్చరికలు జారీ చేశారు.