‘నిమ్మల’మైన అబద్ధాలు | Water Resources Minister Ramanaidu on Veligonda project | Sakshi
Sakshi News home page

‘నిమ్మల’మైన అబద్ధాలు

Feb 21 2025 5:42 AM | Updated on Feb 21 2025 5:42 AM

Water Resources Minister Ramanaidu on Veligonda project

వెలిగొండ ప్రాజెక్టుపై జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు వక్రీకరణలు

జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేసిన నాటి సీఎం వైఎస్‌ జగన్‌ 

పునరావాసానికి రూ.1400 కోట్లు ఖర్చు చేస్తే జూన్‌లో నీటి తరలింపునకు హామీ 

కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా పడకేసిన పనులు.. 

పునరావాసం కల్పించి ఉంటే ఆగస్టులోనే నీటి తరలింపునకు చాన్స్‌ 

రెండేళ్లలో వెలిగొండ పూర్తిచేస్తాం.. రూ.4 వేల కోట్లు అవసరమని మంత్రి వెల్లడి 

సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టుపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వక్రీకరణలతో అవాస్తవాలు మాట్లాడారు. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని.. దీనికోసం రూ.4 వేల కోట్లు అవసరమని చెప్పారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 4.50 లక్షల ఎకరాలకు సాగు, 25 లక్షల మందికి తాగునీరు అందజేసే వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన పనులను ఏవీ గత ప్రభుత్వం పూర్తి చేయలేదని, రైతులను గృహనిర్బంధం చేసి బందోబస్తు మధ్య ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం విడ్డూరమన్నారు. 

మొదటి సొరంగంలో 1.20 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర రోడ్డును, రెండో సొరంగంలో 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉందని వీటిని చేయడానికి 9 నెలలు పడుతుందన్నారు. రెండో సొరంగంలో 6.8 కి.మీ. లైనింగ్‌ చేయాలని.. భారీ టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) కూడా ఉందని, దానిని తొలగించేందుకు చాలా సమయం  పడుతుందని చెప్పారు. 

21.8 కి.మీ. ఫీడర్‌ కెనాల్‌ పనుల పటిష్ఠతను తేల్చాల్సి ఉందన్నారు. 1996లో సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రాజెక్టుకు భూమి పూజ చేసి.. 2014–19లో పనులకు రూ.1,319 కోట్లు ఖర్చు చేశారని నిమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులకు రూ.647 కోట్లు ఖర్చు చేశారని వివరించారు.  

వాస్తవం ఇదీ.. 
2014–19 మధ్య వెలిగొండ జంట సొరంగాలను పూర్తి చేయలేక టీడీపీ సర్కార్‌ చేతులెత్తేసింది. కానీ, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ జంట సొరంగాలను 2019–24 మధ్య అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేశారు. మొదటి సొరంగం లైనింగ్‌ పూర్తిగా, రెండో సొరంగంలో 12 కి.మీ. పొడవునా లైనింగ్‌  పూర్తయింది. రెండు సొరంగాలను 2024, మార్చి 6న సీఎం హోదాలో జగన్‌ జాతికి అంకితం చేశారు. 

రెండో సొరంగం లైనింగ్‌ పూర్తి చేసి.. నల్లమల సాగర్‌ నిర్వాసితులకు పునరావాసం కోసం రూ.1,400 కోట్లు ఖర్చు చేస్తే శ్రీశైలం నుంచి నల్లమల సాగర్‌కు 2024 జూన్‌లో నీటిని తరలిస్తామని  హామీ ఇచ్చారు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు పనులను పట్టించుకోలేదు. 

రెండో సొరంగం లైనింగ్‌ పూర్తి చేయలేకపోయినా కనీసం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే, 2024 ఆగస్టులోనే నల్లమలసాగర్‌కు శ్రీశైలం నుంచి నీటిని తరలించే అవకాశం ఉండేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, కూటమి ప్రభుత్వ నిర్వాకాన్ని కప్పిపుచ్చుకోవడానికి మంత్రి నిమ్మల వాస్తవాలను వక్రీకరిస్తుండడంపై వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement