విశాఖలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శవపేటికలో మృతదేహాల నమూనాలతో నిరసన తెలుపుతున్న ప్రజలు
కొత్త పింఛన్ల మంజూరేదీ?
అవ్వాతాతలు, దివ్యాంగుల పొట్ట కొడుతున్న చంద్రబాబు
రెండేళ్లలో 6 లక్షలకుపైగా పింఛన్లను తొలగించిన దుర్మార్గ ప్రభుత్వమిది
చనిపోయిన వారి స్థానంలో కొత్తవారికి పింఛన్లు ఇవ్వరా?
శవపేటికలతో వినూత్న నిరసన చేపట్టిన వైఎస్సార్సీపీ
విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్
బీచ్రోడ్డు (విశాఖ): మాయమాటలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. అవ్వతాతలకు, వితంతువులకు, దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు శవపేటికలలో వృద్ధుల మృతదేహాల నమూనాలతో వినూత్న నిరసన చేపట్టారు. ‘చనిపోయిన వృద్ధుల పింఛన్లయినా కొత్త వారికి ఇప్పించండి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భారీగా హాజరైన కార్యకర్తలు, నాయకుల నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది.
పేదల పొట్ట కొడుతున్నారు
ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 66 లక్షల పైచిలుకు పెన్షన్లు అందజేశారని గుర్తు చేశారు. కానీ, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా, కుంటిసాకులతో ఆరు లక్షల మందికిపైగా అవ్వతాతల పెన్షన్లు తొలగించి వారి పొట్ట కొట్టారని మండిపడ్డారు.

సూపర్ సిక్స్ పథకాలు చెప్పి ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా, తండ్రీకొడుకులు తెలంగాణలో పండగలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. గత రెండేళ్లలో సహజంగా చనిపోయిన వృద్ధుల స్థానంలోనూ కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ 31వ వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపూ ఆనంద్, దక్షిణ నియోజకవర్గ పరిశీలకులు వీసాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


