దేవుడంటే నమ్మకం లేదు.. పాప భీతి లేదు..

Vijayasai Reddy Fires On Velagapudi Ramakrishna - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణపై వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో..  ‘‘ విజయవాడలో వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ దేవుడి మీద ప్రమాణం చేస్తానని సవాల్ విసిరినట్టుగా మీడియాలో చూశాను. రామకృష్ణ తామంతా కలిసి చంపేసిన వంగవీటి మీద అయినా ప్రమాణం చేయగలడు, చంద్రబాబు వల్ల మరణించిన ఎన్టీఆర్ మీద అయినా ప్రమాణం చేయగలడు, తన భార్య మీద అయినా ప్రమాణం చేయగలడు, తన పిల్లల మీద అయినా ప్రమాణం చేయగలడు. ఎందుకంటే, దేవుడు అంటే నమ్మకం లేదు, పాప భీతి లేదు కాబట్టే, వంగవీటి హత్య తర్వాత విశాఖకు పారిపోయి వచ్చాడు.  విశాఖ వచ్చిన వెలగపూడి ఏం చేశాడంటే.. భూములు మేశాడు, పీకలు కోశాడు అని అనేక మంది చెబుతున్నారు.

ఈయనకు బినామీ భూములు లేవని ప్రమాణం చేస్తాడా?, బినామీ భూములు లేకపోతే ఎందుకు ఉలికిపాటుకు గురి అవుతున్నాడు, ఎందుకు తన ఆస్తులన్నీ పోయినట్టు బాధపడుతున్నాడు?. తనకు ఒక్క అంగుళం భూమి కూడా లేకపోతే బదులు తీర్చుకుంటానని ఎందుకు ప్రగల్భాలు పలుకుతున్నాడు?. ఈ విషయాలన్నింటికీ అతనే సమాధానం చెప్పాలి. విశాఖపట్నంలో వెలగపూడి రామకృష్ణను ఎవరైనా ధర్మాత్ముడు అనుకుంటారా లేక ఒక గూండా, రౌడీ ఎలిమెంటుగా భావిస్తున్నారా.. ?. రాక్షసత్వం నిండిన వ్యక్తి దేవుడి మీద ప్రమాణం చేయటం ఏమిటి? వినటానికి కూడా వెగటుగా ఉంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top