Vangaveeti Narendra
తాడేపల్లి: ఆర్థిక నేరం చేసిన కంపెనీ వ్యవహారంలో బెజవాడ పోలీస్ బిగ్బాస్ పాత్ర ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీబీఐ, ఈడీతో విచారించాల్సిన కేసును సైతం నీరు గార్చారని తెలిపారు.
అద్వైక ట్రేడింగ్ అక్రమ డిపాజిట్ల కేసులో భారీగా డీల్ మాట్లాడుకున్నారని వంగవీటి నరేంద్ర ఆరోపించారు. 1,500 మంది బాధితుల ఫిర్యాదును ఒకటే ఫిర్యాదుగా మార్చి కేసును నీరుగార్చారని తెలిపారు. ‘‘సీబీఐ, ఈడీతో విచారించాల్సిన కేసును తేలిగ్గా ముగించేలా చేశారు. చట్టానికి వ్యతిరేకంగా డబ్బు డిపాజిట్లు చేయించుకున్న మార్గదర్శి, అగ్రిగోల్డు కేసులను కూడా సీబీఐ, ఈడీ విచారించాయి.
మరి అద్వైక కేసులో ఎలాంటి విచారణలు జరగకుండా చేసిందెవరు? బెజవాడ పోలీస్ బాస్ వైట్ కాలర్ రౌడీలు, గూండాలుగా మారిపోయారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులోనూ ఆయన ఎందుకు నోరు మెదపలేదు? సీసీ కెమెరా ఫుటేజీ ఏమైందో ఎందుకు చెప్పటం లేదు?’’ అని వంగవీటి నరేంద్ర నిలదీశారు.


