
విజయవాడ: దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. డా. బీఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. దీనికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు మాట్లాడిన కిషన్ రెడ్డి.. ‘దక్షిణ భారతదేశంలో కూడా అధికారంలో కి వస్తాం. తమిళనాడు, తెలంగాణలో బిజెపి ప్రభుత్వాలు వస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నారు.
అంబేద్కర్ ఉత్సవాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ప్రతిస్టాత్మకం గా నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ జయంతి అనేది ఏప్రిల్ 14వ తేదీనే కాకుండా 10 రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అంబేద్కర్ దళిత సామాజిక వర్గంలో జన్మించి అనేక ఒడిదుడుకులు ఎదురుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఎన్నో అవమానాలకి గురయ్యారు.
ఒక మేధావిగా ఆయన ఎదిగి అనేక పోరాటాలు చేశారు. బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం నింపారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ కీలక పాత్ర వహించారు. అంబేద్కర్ ఎంపీ గా పోటి చేస్తే ఓడించాలని నెహ్రూ విస్తృతంగా ప్రచారం చేసారు. కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పి కొట్టి పార్లమెంట్ కి పంపించేలా మేధావులు కీలక పాత్ర వహించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కాంగ్రెస్ వ్యవహరించింది. రాజకీయ స్వలాభం కోసం ఆనాడు కాంగ్రెస్ పాలన ఉండేది.
అడుగడుగునా అంబేద్కర్ ని అవమానపరిచేలా కాంగ్రెస్ చేసింది. అంబేద్కర్ ఒక మేధావి అయినప్పడికి అనేక రకాలుగా కాంగ్రెస్ అవమానపరిచింది. మొదటి సారి ప్రధానిగా మోదీ ఎన్నిక అయినప్పుడు అంబేద్కర్ కి నివాళులు అర్పించి పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తి తోనే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. రాజ్యాంగాన్ని మరింత శక్తీవంతంగా ఉంచాలని మోదీ ప్రభుత్వం పని చేస్తుంది. రాజ్యాంగానికి గౌరవం ఉండేలా మోదీ ప్రభుత్వం ఉంటుంది. అంబేద్కర్ అంతిమ సంస్కారం చేసిన స్థలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం.
అంబేద్కర్ ఉన్న ప్రదేశాలని పంచ తీర్థ పేరుతో నిర్మాణం చేపట్టాం. పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టి గౌరవించిన ఘనత ప్రధాని మోదీది. దేశానికి సేవ చేసిన అంబేద్కర్ కి కాంగ్రెస్ భారతరత్న ఇవ్వకుండా అవమానపరిచింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ కి భారత్ రత్న ఇచ్చింది. అంబేద్కర్ సిద్ధాంతం, స్ఫూర్తి తో ప్రధాని మోదీ పని చేస్తున్నారు’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.