
మద్దిపాడులో జాతీయ రహదారిపై పొగాకు తగలబెట్టి నిరసన తెలుపుతున్న రైతులు
కూటమి సర్కారు తీరుకు నిరసనగా ఆందోళనలు
ప్రకాశం జిల్లా మద్దిపాడు, కొండపి వేలం కేంద్రాల వద్ద రాస్తారోకో
మద్దిపాడు వద్ద జాతీయ రహదారిపై పొగాకు తగలబెట్టి ఆగ్రహం
కొండపి–టంగుటూరు రహదారిపై ధర్నా.. గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్
మద్దిపాడు/కొండపి: కూటమి సర్కారు, అధికారుల తీరుపై పొగాకు రైతులు భగ్గుమన్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లాలో మరోసారి రోడ్డెక్కారు. మద్దిపాడు, కొండపి వేలం కేంద్రాల్లో గురువారం ఆందోళనలకు దిగారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలోని ముండ్లమూరు క్లస్టర్ రైతులు తీసుకొచి్చన పొగాకుకు ధర పూర్తిగా తగ్గించడంతో కోపోద్రిక్తులయ్యారు. జాతీయ రహదారిపై పొగాకు తగలబెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం నోబిడ్ అయిందని, కంపెనీలన్నీ కుమ్మక్కయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కిలోకు రూ.220 ఇస్తామని చెప్పిన కంపెనీలు రూ.180కి తగ్గించాయని, చివరకు రూ.160కి కొనుగోలు చేస్తామని, అదీ కాకుండా రూ.125లోపే కొనుగోలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతుల ఆందోళనతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
కొండపిలోని పొగాకు వేలం కేంద్రంలోనూ గురువారం జువి్వగుంట, అయ్యవారిపాలెం, తంగెళ్ల, జాల్లపాలెం, పీరాపురం గ్రామాలకు చెందిన రైతులు కంపెనీలు ధర పూర్తిగా తగ్గించేశాయని వేలాన్ని బహిష్కరించారు. కిలోకు కనిష్ట ధర రూ.160 కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేలం కేంద్రం ఎదురుగా కొండపి–టంగుటూరు రహదారిపై బైఠాయించారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి వేలం నిర్వహణ అధికారి జి.సునీల్ కుమార్, రైతులతో చర్చలు జరిపారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు.
పొగాకు పంట సాగు పరిమాణం నిర్ధారణ
కొరిటెపాడు: గుంటూరు జీటీ రోడ్డులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో గురువారం 165వ పొగాకు బోర్డు సమావేశం నిర్వహించారు. బోర్డు చైర్మన్ యశ్వంత్కుమార్ చిడిపోతు అధ్యక్షత వహించారు. ఏపీ ప్రాంత పంట కాలానికి పంట సాగు పరిమాణం నిర్ధారించారు. అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్, రైతు సాగుబడికి ఆమోదయోగ్యమైన పరిధికి అనుగుణంగా ఈ ప్రాంత పంట కాలానికి 142.00 మిలియన్ కిలోల పరిమాణాన్ని సమావేశంలో నిర్ధారించారు. సమావేశంలో ఈడీ విశ్వశ్రీ, డైరెక్టర్ (ఆక్షన్) శ్రీనివాస్, వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య పలువురు సభ్యులు హాజరయ్యారు. వర్చువల్ ద్వారా కర్ణాటక ఎంపీ పి.మహేశ్కుమార్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్.. కర్ణాటక, గుజరాత్, బిహార్, యూపీ రాష్ట్రాల అధికారులూ పాల్గొన్నారు.