‘కనీస’ కనికరం లేదా..! | Teachers Protest in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘కనీస’ కనికరం లేదా..!

Jun 23 2025 5:42 AM | Updated on Jun 23 2025 5:42 AM

Teachers Protest in Andhra Pradesh

విశాఖ డీఈవో కార్యాలయం ముందు బైఠాయించిన ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు

కూటమి సర్కారు కక్ష సాధింపుపై మినిమం టైం స్కేల్‌ టీచర్ల ఆందోళన  

జీవో 47 ప్రకారం స్థానికంగా పోస్టింగ్‌ ఇవ్వాలని నిరసనలు

వచ్చే జీతాలకు 60, 70 కిలోమీటర్లు వెళ్లలేమని స్పష్టీకరణ 

దిగొచ్చిన విద్యాశాఖ, అన్ని ఖాళీలూ చూపాలని ఆదేశం

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: అతి తక్కువ వేతనంపై ప్రభుత్వ స్కూళ్లల్లో పనిచేస్తున్న 2008, 1998 డీఎస్సీ ఎంటీఎస్‌(మినిమం టైం స్కేల్‌) టీచర్లపై కూటమి ప్రభుత్వం కక్షగట్టినట్టు వ్యవహరిస్తోంది. జీవో నంబర్‌ 47కు విరుద్ధంగా కేటగిరీ–4 స్కూళ్లల్లో నియామకాలపై అన్ని జిల్లాల్లోనూ కౌన్సెలింగ్‌ కేంద్రాల వద్ద ఎంటీఎస్‌ టీచర్లు ఆదివారం ఆందోళనకు దిగారు. తమకు వచ్చే కొద్దిపాటి వేతనాలతో 60–70 కిలోమీటర్ల దూరంలో పనిచేయలేమని, తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ఉదయం కౌన్సెలింగ్‌ ప్రారంభమైన వెంటనే ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడంతో ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో దిగొచ్చిన పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు అన్ని పాఠశాలల్లో మిగిలిన ఖాళీలు ఎంటీఎస్‌లకు చూపించాలని ఆదేశించారు. గతంలో 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్స్‌ ఇవ్వక అన్యాయానికి గురయ్యారు. దీంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వీరిని మినిమం టైం స్కేల్‌పై విధుల్లోకి తీసుకుంది. 2021లో 2008 డీఎస్సీ అభ్యర్థులు 2,193 మందికి, 2023లో 1998 డీఎస్సీ అభ్యర్థులు 4,072 మందికి పోస్టింగ్స్‌ ఇచ్చింది. కనీస వేతనంపై సేవలు అందిస్తున్నందున ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వారి సొంత ప్రాంతాలకు దగ్గరలో­నే పోస్టింగ్‌ ఇవ్వాలని జీవో నంబర్‌ 47లో పేర్కొంది.  

రెగ్యులర్‌ టీచర్ల బదిలీలతో దక్కని అవకాశం 
ఎంటీఎస్‌ ద్వారా 6,265 మందికి రెండు దఫాలుగా పోస్టింగ్స్‌ ఇవ్వగా, గత రెండేళ్లలో 2 వేల మంది వరకు రిటైరయ్యారు. మిగిలిన 4 వేల మందికి కూటమి ప్రభుత్వం జూన్‌–ఏప్రిల్‌ వరకు 11 నెలల కాలానికి విధుల్లోకి తీసుకుని వేతనం చెల్లిస్తోంది. జూన్‌ నెలలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక తిరిగి కౌన్సెలింగ్‌ ద్వారా వారిని పోస్టుల్లోకి తీసుకుంటోంది. ఈసారి రెగ్యులర్‌ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టడం, ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించడంతోపాటు గతంలో వలే 10 శాతం స్థానాలను బ్లాక్‌ చేయకపోవడంతో కేటగిరీ–1,2,3 పోస్టులన్నీ రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో భర్తీ చేశారు. పైగా ఈసారి ఎంటీఎస్‌లకు స్థానిక ప్రాంతాల్లో పోస్టింగ్‌ అన్న అంశాన్ని తొలగించి పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఇటీవల రెగ్యులర్‌ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ముగియడంతో ఖాళీగా ఉన్న కేటగిరీ–4లోని మారుమూల గ్రామీణ పాఠశాలలను మాత్రమే ఎంటీఎస్‌ లకు కేటాయిస్తోంది. కొన్ని జిల్లాల్లో అసలు ఖాళీలే లేకపోవడంతో ఎంటీఎస్‌లను క్లస్టర్‌ పూల్‌లో ఉంచా రు. తక్కువ వేతనంతో పనిచేస్తున్న వీరికి గత ప్రభుత్వం స్థానికంగా పోస్టింగ్స్‌ ఇస్తే కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చేయడంపై ఆదివారం ఎంటీఎస్‌లు ఆందోళనకు దిగారు. దీంతో డీఎస్సీ–2025 కోసం ఉంచిన ఖాళీలనూ చూపా లని అధికారులు ఆదేశించారు. 1998 డీఎస్సీ అభ్యర్థుల్లో అత్యధికులు అనారోగ్యాలతో ఉన్నవారు, రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్నవారే. ఇలాంటి వారిపై దయ చూపాలని రెగ్యులర్‌ టీచర్లే కోరుతున్నారు.  

కూటమి సర్కారు తీరుపై నిరసన  
ఎంటీఎస్‌ టీచర్లు రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆందోళన బాట పట్టారు. విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ఆదివారం ముట్టడించారు.  కౌన్సెలింగ్‌ను బహిష్కరించారు. ఎంటీఎస్‌ల కౌన్సెలింగ్‌ను విశాఖ వ్యాలీ స్కూల్లో ఆదివారం నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు సన్నద్ధం కాగా, మైదాన ప్రాంతాల్లో ఖాళీలు లేవని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలకు కౌన్సెలింగ్‌ చేస్తున్నారని తెలుసుకున్న ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. డీఈఓ ప్రేమ్‌కుమార్‌ను కొద్దిసేపు చుట్టుముట్టి ఆందోళన వ్యక్తంచేశారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరులోని డీఈఓ కార్యాలయాల వద్ద కూడా  ఎంటీఎస్‌ టీచర్లు ఆందోళన చేశారు. కౌన్సెలింగ్‌ను బహిష్కరించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఒంగోలు నగరంలోని డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్లోనూ కౌన్సెలింగ్‌ను బహిష్క రించి ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. డీఈఓ రమేష్ కు వినతిపత్రం అందించారు. అనంతపురంలోని జిల్లా సైన్స్‌ సెంటర్‌లో జరప తలపెట్టిన కౌన్సెలింగ్‌ను ఎంటీఎస్‌ టీచర్లు బహిష్కరించారు.  కౌన్సెలింగ్‌ కేంద్రానికి వచ్చిన డీఈఓ ప్రసాద్‌బాబును అడ్డుకున్నారు.

మానవత్వం చూపాలి
ఇప్పటికే గత ఏడాది మేం కొండల్లో ఉద్యోగం చేశాం. మళ్లీ అక్కడే పనిచేయడానికి మా ఆరోగ్యం సహకరించట్లేదు. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మా పిల్లల్ని చదివించుకోలేపోతున్నాం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మాపై జాలి చూపించి న్యాయం చేయాలని కన్నీటితో వేడుకుంటున్నాం. – కె.వి దుర్గాదేవి, 2008 డీఎస్సీ ఉపాధ్యాయిని, విశాఖపట్నం      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement