కోడి పందెం ముసుగులో గొడవ.. వైఎస్సార్‌సీపీ నాయకుడి హత్య! | TDP Supporters Attack On YSRCP Leader At NTR Distrcit | Sakshi
Sakshi News home page

కోడి పందెం ముసుగులో గొడవ.. వైఎస్సార్‌సీపీ నాయకుడి హత్య!

Jan 16 2025 1:56 PM | Updated on Jan 16 2025 1:59 PM

TDP Supporters Attack On YSRCP Leader At NTR Distrcit

సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో కూటమి పాలనలో వైఎస్సార్‌సీపీ యువనేత మణితేజ అనుమానస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది.  ప్రశాంతంగా ఉన్న నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పచ్చ గూండాలే హత్య చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక, మణితేజ మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు.

మణితేజ మృతి విషయం తెలుసుకుని నందిగామలోని ఆసుపత్రి వద్దకు వైస్సార్‌సీపీ నాయకులు చేరుకున్నారు. మణితేజ మృతదేహాన్ని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు సహా పలువురు పరిశీలించారు.

అనంతరం,  దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మణితేజది ముమ్మాటికీ రాజకీయ హత్యే. మణితేజ మృతిపై  మాకు అనేక అనుమానాలున్నాయి. మణితేజ కుటుంబం వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా ఉంటోంది.  వారంతా పార్టీలో యాక్టివ్‌గా ఉండటం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు.  ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పొట్టనపెట్టుకున్నారు. మణితేజ హత్యను టీడీపీ, పోలీసులు ప్రమాదంగా చిత్రీకరించేయత్నం చేస్తున్నారు. మణితేజ మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి.

ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలి. మణితేజ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. మణితేజ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులదే. ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మూడు సంక్రాంతులే. మళ్లీ వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తారు. తప్పుచేసిన వారికి చట్టపరంగా కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం. మణితేజ కుటుంబానికి చంద్రబాబు, పవన్, లోకేష్ సమాధానం చెప్పాలి. రెడ్ బుక్ ఇంకా తెరిచే ఉంది ముగిసిపోలేదని లోకేష్ అంటున్నాడు. మనుషుల ప్రాణాలు తీయడమేనా రెడ్ బుక్ అంటే అని ప్రశ్నించారు.

అనంతరం, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. మణితేజ మృతిని ప్రమాదంగా చిత్రీకరించారు. తలపై బలంగా కొట్టినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మణితేజ మృతిపై మాకు అనేక అనుమానాలున్నాయి. వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు చేసినందుకు మణితేజను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కోడిపందాల వద్ద గొడవ తర్వాత మణితేజ చనిపోయాడు. మణితేజ మృతిని హత్య కోణంలోనే దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరావు మాట్లాడుతూ.. మణితేజది ముమ్మాటికీ హత్యే. మణితేజ మృతిని హత్య కేసుగానే నమోదు చేయాలి. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. జై జగన్ అంటే కేసులు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను చించి తిరిగి మా పార్టీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేస్తున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులను బెదిరిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement