మోజు తీర్చుకుని మొహం చాటేసిన టీడీపీ నేత.. | Sakshi
Sakshi News home page

మోజు తీర్చుకుని మొహం చాటేసిన టీడీపీ నేత..

Published Tue, Mar 12 2024 8:18 AM

TDP councillor Cheating On woman - Sakshi

తాడిపత్రి/రూరల్‌: యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకుని మోజు తీర్చుకున్నాక మొహం చాటేశాడో టీడీపీ కౌన్సిలర్‌.  పెళ్లి చేసుకోమని   నిలదీస్తే బాధితురాలిపైనే దాడి చేశాడు. దీంతో ఆమె సోమవారం అనంతపురం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఎస్పీ సూచన మేరకు తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. తాడిపత్రి 30వ వార్డు కౌన్సిలర్‌ కొత్తపల్లి మల్లికార్జున మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరుడు. పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ కొన్ని నెలల క్రితం వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.

 యువతిని ఆమె ఇంటి  నుంచి తీసుకొచ్చి తనకు తెలిసిన వారి ఇంట్లో    ఉంచాడు. అనంతరం ఆమెతో  సహజీవనం చేశాడు. యువతి రెండు సార్లు గర్భం దాల్చగా, ఇప్పుడే పిల్లలు ఎందుకు అంటూ అబార్షన్‌లు కూడా చేయించాడు. ఇటీవల యువతికి అనుమానమొచ్చి మల్లికార్జున సెల్‌ఫోన్‌ పరిశీలించగా, వాట్సాప్‌లో మరో మహిళతో చాటింగ్‌ చేసిన విషయం బయటపడింది. దీనిపై మల్లికార్జున ప్రశ్నిస్తే కొట్టి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే మల్లికార్జునతో సంబంధం పెట్టుకున్న మహిళ కూడా రంగంలోకి దిగింది. తను మల్లికార్జునతో తీయించుకున్న ఫొటోలను బాధిత యువతి      సెల్‌ఫోన్‌కు పంపింది. 

వారం క్రితం మళ్లీ యువతి ఇంటికి వచ్చిన మల్లికార్జున మాయమాటలు చెప్పి రెండు రోజులు గడిపాడు.  వివాహం చేసుకోమని ప్రశ్నిస్తే తీవ్రంగా కొట్టాడు. విషయం బయటకు చెబితే భూమిపైనే లేకుండా చేస్తానంటూ బెదిరించాడు. తాను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తనతోనే జీవితం అంటూ చెప్పాడు. దీంతో ఆమె మల్లికార్జున ఇంటికి వెళ్లింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన కుటుంబసభ్యులకు వివరించింది. సర్దిచెప్పాల్సిన వారు కూడా దౌర్జన్యం చేశారు. యువతిని కొట్టి పంపించారు. 

దీంతో యువతి కుమిలికుమిలి   ఏడ్చింది. తెలిసిన వారి సూచన మేరకు సోమవారం అనంతపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గోడు వెళ్లబోసుకుంది. ఆయన సూచన మేరకు తాడిపత్రి పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనలాంటి వారి జీవితాలతో ఆటలాడుతున్న మల్లికార్జునపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. 
 

Advertisement
Advertisement