జాతి మెరిసేలా.. పునరుత్పత్తి పెరిగేలా! | Surrogacy key to reviving endangered Punganur cows | Sakshi
Sakshi News home page

జాతి మెరిసేలా.. పునరుత్పత్తి పెరిగేలా!

Jul 27 2022 10:58 AM | Updated on Jul 27 2022 10:58 AM

Surrogacy key to reviving endangered Punganur cows - Sakshi

అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవుల సంరక్షణే ధ్యేయంగా వెటర్నరీ యూనివర్సిటీ అడుగులు వేస్తోంది. మేలు జాతి దూడల పరిరక్షణే లక్ష్యంగా దూసుకుపోతోంది. దీనికోసం అత్యాధునిక పద్ధతులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆధునిక టెక్నాలజీతో పిండ మార్పిడి చేసేందుకు వీలుగా సరికొత్త ప్రయోగశాలను సిద్ధం చేసింది. సరోగసీ ద్వారా పుంగనూరు జాతి సంతతిని మరింత పెంచేలా ప్రణాళిక రచించింది. ఈమేరకు పలమనేరులో ఏర్పాటు చేసిన ప్రయోగశాలను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు బుధవారం ప్రారంభించనుండటం విశేషం. 

తిరుపతి ఎడ్యుకేషన్‌: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ తన ప్రగతి ప్రస్థానంలో మరో ముందడుగు వేసింది. ఉమ్మడి జిల్లాలకు తలమానికమైన పుంగనూరు జాతి పొట్టిరకం ఆవుల పరిరక్షణ, మేలు జాతి దూడల పునరుత్పత్తికి ఇన్‌విట్రో ఫరి్టలిటీ(ఐవీఎఫ్‌), ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌(పిండ మార్పిడి) టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. పలమనేరులోని వర్సిటీ పశుపరిశోధన స్థానంలో ఐవీఎఫ్, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ టెక్నాలజీ ప్రయోగశాలలను ఏర్పాటు చేసింది. వీటి కోసం రూ.1.8 కోట్ల రా్రïÙ్టయ కృషి వికాస్‌ యోజన(ఆర్కేవీవై) నిధులు వెచ్చించింది.  

మూడో ప్రయోగశాల 
శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధి, పలమనేరులోని పశుపరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఐవీఎఫ్‌ ల్యాబ్‌ మూడవది. గుంటూరులోని లాం ఫామ్‌లో ఒంగోలు జాతుల అభివృద్ధికి ఐవీఎఫ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తున్నారు. అలాగే టీటీడీతో కుదుర్చుకున్న ఎంఓయూలో భాగంగా టీటీడీ గోశాలల్లోని దేశీయ ఆవుల్లో మేలు జాతిని ఉత్పత్తిచేసి శ్రీవారి సేవకు ఉపయోగించేందుకు వీలుగా తిరుపతి వెటర్నరీ క్లినికల్‌ కాంప్లెక్స్‌ (వీసీసీ)లో రూ.3.2 కోట్లతో ఐవీఎఫ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా దేశీయ ఆవుల ఉత్పత్తి పెంచి రోజుకు 3 వేల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధి కోసం పలమనేరు పరిశోధన స్థానంలో ఐవీఎఫ్‌ ప్రయోగశాలను బుధవారం ప్రారంభించనున్నారు.  

నేడు ప్రారంభం 
వర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం, పలమనేరులోని పశు పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన ఐవీఎఫ్, ఈటీ ప్రయోగశాలలను పశు సంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు బుధవారంప్రారంభించనున్నారు. 

విద్యలో ప్రమాణాల పెంపునకు 
పరిశోధనల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తున వెటర్నరీ వర్సిటీ పశువైద్య విద్యలో ప్రమాణాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వెటర్నరీ వర్సిటీ ఆవరణలో రూ.7.04 కోట్లతో అత్యాధునిక వసతులతో గ్రంథాలయాన్ని నిర్మించారు. ఆకట్టుకునే విధంగా భవన నిర్మాణం రూపకల్పన చేశారు. ఇందులో పూర్వవిద్యార్థి (ఎన్‌ఆర్‌ఐ) ప్రతాపరెడ్డి పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పశువైద్య విద్య, న్యూట్రిషన్‌ కోర్సులకు సంబంధించి అత్యాధునిక జర్నల్స్‌ అందుబాటులో ఉంచనున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement