తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ మా స్థలం కబ్జా చేశారు
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే నానికి చెప్పినా పట్టించుకోలేదు
ఐదుసార్లు చంద్రబాబుకు విన్నవించినా ఉపయోగంలేదు
రంగంపేట టీడీపీ మహిళా కార్యకర్త ఆవేదన
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతిలో వృద్ధ దంపతుల భూమిని టీడీపీ నేత కబ్జా చేసిన వ్యవహారం మరువక ముందే.. మరో టీడీపీ నేత భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్దనున్న తమ స్థలాన్ని తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ కబ్జా చేశారని చంద్రగిరి నియోజకవర్గం రంగంపేట పంచాయతీ మాజీ సర్పంచ్ గోపాల్రెడ్డి భార్య, టీడీపీ మహిళా కార్యకర్త, మునిరాజమ్మ ఆరోపించారు. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. దీంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వద్దకు ఐదుసార్లు వెళ్లినా స్పందనలేదంటూ బుధవారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. భూ కబ్జా నుంచి తమకు న్యాయం చేయాలంటూ రెండు చేతులు జోడించి కన్నీటితో వేడుకున్నారు.
ఆమె ఇంకా ఏమన్నారంటే..
2017లో తిరుచానూరు రోడ్డు మార్కెట్ యార్డు సమీపంలోని సర్వే నెంబరు 252/2ఏ లోని 80 సెంట్ల భూమిని రూ.మూడున్నర కోట్లకు కోనుగోలు చేశాం. ఆన్లైన్ రికార్డుల్లో మా పేరు ఉంది. అనంతరం కొద్దిరోజుల పాటు విదేశాల్లోని మా కుమార్తె వద్దకు వెళ్లాం. ఆ సమయంలో స్థలాన్ని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకుని మేము అడ్డుకునే ప్రయత్నం చేశాం.
అయితే, స్థలం వద్ద జేబీ శ్రీనివాస్ మనుషులు వచ్చి మాపై దాడులు చేయడంతో పాటు ‘ముసలామెను గోతిలో పూడ్చిపెట్టండి.. చంపేయండి’.. అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా పట్టించుకోవడంలేదు. 40 ఏళ్లుగా టీడీపీలో ఉంటున్న మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని స్థానిక ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. మా స్థలంలోని కరెంట్ మీటర్ను దౌర్జన్యంగా తొలగించారు. జేబీ శ్రీనివాస్ వద్దకెళ్లి మా స్థలాన్ని ఇవ్వాలని ప్రాథేయపడినా పట్టించుకోలేదు.


