
సోషల్ మీడియాకు బానిసలువుతున్న విద్యార్థులు
పెరిగిన సోషల్ మీడియా వినియోగం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పది లక్షలు దాటిన సెల్ఫోన్ యూజర్లు
అతివాడకంతో ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న వైద్యులు
కూర్చున్నా.. పరిగెడుతున్నా..తింటున్నా..పడుకున్నా..సెల్ చెంతనే ఉండాల్సిందే. ఇది లేని జీవితాన్ని ఊహించడం కష్టసాధ్యంగా మారుతోంది. పిల్లలు పెద్దల ప్రమేయం లేకుండానే గేమ్లు ఆడుతున్నారు. తమకు కావాల్సిన ఆటలు డౌన్లోడ్ పెట్టుకుంటున్నారు. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో మంచితోపాటు చెడు మిళితమై ఉండడంతోపాటు అతి వినియోగంతో అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పలమనేరు: స్మార్ట్ఫోన్ల వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎలాంటే.. ఒక నిమిషం చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు నేటి విద్యార్థులతు, పిల్లలు, యువకులు. డ్రగ్స్కు బానిసైనట్టు స్మార్ట్ఫోన్ (Smartphone) కారాగారంలో నేటి తరం బందీలుగా మారారు. ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం విద్యార్థుల్లో ఎక్కువైంది. పిల్లాడు అన్నం తినాలంటే మొబైల్, బడికి రెడీ కావాలంటే మొబైల్, బడి నుంచి రాగానే సెల్ఫోన్ చేతిలో పెట్టాల్సిందే. పసిబిడ్డలు సైతం ఏడుపు ఆపాలంటే తల్లిపాలు పట్టడం కంటే చేతిలో సెల్ పెట్టగానే సైలెంట్ అవుతున్నారు.
మొబైల్ లేకుంటే మనషులకు బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకనే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు స్టార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోవడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది.
ఏటా15 శాతం పెరుగుతున్న సెల్ ఫోన్ వినియోగం
గత నాలుగేళ్లుగా సెల్ఫోన్ల వాడకం ఏటా 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలీఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. స్మార్ట్ఫోన్లను వాడేవారిలో రోజుకు సగటున యువత 4 గంటలు, విద్యార్థులు 2 గంటలు, గృహిణిలు 2 గంటలు, అధికారులు 1.30 నిమిషాలు, పిల్లలు గంటపాటు సమయాన్ని కేటాయిస్తున్నట్టు తెలిసింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉదాహరణే తీసుకుంటే... 1990లో కీప్యాడ్ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లెలో రిలయన్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్వర్క్ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోని వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 8 వేల దాకా సెల్ఫోన్ టవర్లున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 44 లక్షలు కాగా వీరిలో సెల్ఫోన్లు (కీఫ్యాడ్, టచ్ మొబైల్)వాడే వారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షలకు చేరింది.
ఇదిగో సాక్ష్యం..
పలమనేరు పట్టణంలో ఇంజినీరింగ్ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్ఫోన్ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని పదో తరగతి చదివే బాలికకు సెల్ఫోన్ కొన్విలేదని తన చేతిని బ్లేడ్తో కోసుకుని ఆస్పత్రి పాలైంది. సెల్ ఇవ్వలేదని ఐదో క్లాస్ చిన్నారి ఇంటి నుంచి పరారయ్యాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి.
ఎక్కువ మంది యూట్యూబ్ వీక్షకులే
స్మార్ట్ఫోన్ వాడుతున్న వారిలో 80 శాతం మంది యూట్యూబ్ చూస్తుండగా, 60 శాతం మంది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్ర్రాగామ్ను వాడుతున్నట్టు గూగూల్ చేసిన సర్వేలో తేలింది. విద్యార్థులు, యువతలో 50 శాతం మంచి ఆన్లైన్లో గేమ్స్ కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. మహిళలు పనిపాట చేసుకుంటూ కూడా సీరియళ్లను సెల్లోనే చూసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇక చిన్నపిల్లలు సైతం స్మార్ట్ఫోన్లో కార్టూన్ స్టోరీస్ చూడకుండే ఏడుపు మొదలు పెట్టడం చూస్తూనే ఉన్నాం.
అనారోగ్య సమస్యలు తప్పవు
సెల్ చూస్తున్న కారణంగా నిద్రలేమి ప్రధాన సమస్యగా మారుతోంది. దీంతో మనిషి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతింటోందని(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తెలిపింది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేమి కారణంగా అధిక బరువు, లావెక్కడం జరుగుతుంది. పిల్లలకు తలనొప్పి, చూపు మందగించి కంటి అద్దాలను వాడాల్సిందే. అలాగే పలు అనారోగ్య సమస్యలు తప్పవు. – మమతారాణి, ఏరియాఆస్పత్రి సూపరిండెంటెంట్, పలమనేరు
సోషల్ మీడియా వాడకం పరిస్థితి ఇదీ!
ఇటీవల యాన్యువల్ స్టేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదికలో వెల్లడించిన అంశాలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా (Social Media) బానిసలైన వారిలో 14 ఏళ్లలోపు పిల్లలు 79 శాతం, 15 నుంచి 20 ఏళ్ల వయసున్న వారిలో 82 శాతం, మహిళలు 75 శాతం ఉండడం కొసమెరుపు.