తిరుపతిలో బైక్ ర్యాలీ చేస్తున్న జూడాలు
అత్యవసర వైద్య సేవలూ అందక రోగులకు తీవ్ర అవస్థలు
చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి/మహారాణిపేట/ తిరుపతి తుడా: స్టైపెండ్ పెంపు, ఇతర న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెను జూనియర్ డాక్టర్లు(జూడా) ఉధృతం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంగళవారం అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల వద్ద ధర్నాలు కొనసాగించారు. రెండు చేతులు బంధించుకుని, నోటికి ప్లాస్టర్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వమే తమను చేతులు కట్టేసి, రోగులకు సేవలు అందించలేని స్థితికి తెచ్చిందని మండిపడ్డారు. విశాఖలో తమ డిమాండ్లను చేతులపై ముద్రించుకొని నిరసన తెలపగా.. తిరుపతిలో బైక్ ర్యాలీతో కదంతొక్కారు. కాగా, జూనియర్ డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు బహిష్కరించడంతో బోధనాస్పత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం నిరుపేద రోగులు అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. విజయవాడ జీజీహెచ్కు వచ్చిన రోగులను.. వైద్యులు లేరంటూ సిబ్బందే ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించేస్తున్నారు. కర్నూలు, గుంటూరు, విశాఖ, అనంతపురం, తిరుపతి.. అన్ని జీజీహెచ్ల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కానీ వైద్య సేవలపై పెద్దగా ప్రభావం లేదంటూ సూపరింటెండెంట్లు డీఎంఈకి తప్పుడు లెక్కలు రిపోర్ట్ చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో మంగళవారం అడ్మిషన్లు అమాంతం పతనమైనట్లు సమాచారం. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


