సాక్షి, విశాఖపట్నం: రేపు(గురువారం) కేరళ తీరాన్ని నైరుతీ రుతుపవనాలు తాకుతాయని.. 5 తేదీన రాయలసీమలో ప్రవేశిస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. పదో తేదీకి దక్షిణ కోస్తా అంతటా విస్తరిస్తాయని తావరణ శాఖ అధికారి జగన్నాథ్కుమార్ తెలిపారు. జూన్ 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం రుతుపవనాలు విస్తరించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
వారం రోజులపాటు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలే ఉంటాయని మరో ఐదు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏడాది ఎండలు బాగా కాశాయి కాబట్టి వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్పలేమని.. కాసిన ఎండలు, వర్షాలకు సంబంధం ఉండదని జగన్నాథ్కుమార్ వివరించారు.
ఇప్పటికే కేరళంలో తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. కేరళం, తమిళనాడు మీదగా ఏపీలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టాయి. కావలిలో 42.6 డిగ్రీలు అత్యధిక ఉష్ట్రోగ్రతలు నమోదైంది. తీరం వెంబడి బలమైన గాలులు, భీమిలిలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది.

పిడుగుపాటు హెచ్చరిక
రాగల మూడు గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 50-60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ క్రింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.


