One Died And Three Injured In Road Accident Near Puthalapattu In Prakasam District - Sakshi
Sakshi News home page

Prakasam Road Accident: వెంటాడిన మృత్యువు!

Mar 15 2023 3:34 PM | Updated on Mar 15 2023 5:35 PM

Road accident in Prakasam District - Sakshi

హరీష్, కీర్తి దంపతులు

పాలకూరు వద్ద లారీని ఢీకొట్టి బోల్తా పడిన కారు 

ప్రకాశం: గుంటూరులో బంధువులను పరామర్శించి తిరిగి వస్తున్న ఓ కుటుంబాన్ని మత్యువు వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టి బోల్తాపడటంతో ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో ఇద్దరు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం పూతలపట్టు మండలం పాలకూరు సమీపంలో చోటుచేసుకుంది. 

పోలీసుల కథనం మేరకు.. పామూరు మండలం, తాతయ్యపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి(50), భార్య రామ సుబ్బమ్మ(43) కర్ణాటకలోని హల్సూర్‌లో స్థిరపడ్డారు. కుమార్తె కీర్తిరెడ్డి(25), కుమారుడు వంశీ(23)తో కలిసి బెంగళూరులో పీజీ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. గతేడాది కుమార్తెకు సీఎస్‌పురం మండలం జంగవారిపల్లికి చెందిన çసాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హరీష్‌తో వివాహం చేశారు. ఇతను కూడా బెంగళూరులోనే ఉంటూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. 

గుంటూరులో ఉంటున్న సుబ్బమ్మ ఆడపడుచు భర్తకు గుండెపోటు రావడంతో భర్త, కుమార్తెతో కలిసి అల్లుడి కారులో గుంటూరు వెళ్లారు. సోమవారం రాత్రి 9 గంటలకు బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో మంగళవారం తెల్లవారుజామున పూతలపట్టు మండలం పాలకూరు వద్ద ముందు వెళ్తున్న తమిళనాడుకు చెందిన లారీని వీరి కారు అదుపుతప్పి ఢీకొట్టింది. 

కారు బోల్తా పడి నుజ్జునుజ్జయింది. రామసుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందగా హరీష్, వెంకటేశ్వర్‌రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన కీర్తిరెడ్డి(25)ని 108 ఆంబులెన్సులో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వేలూరులోని సీఎంసీకి తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement