
సాక్షి, తాడేపల్లి: ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నెల రోజులపాటు అత్యంత నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది.
రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే గొప్ప పండుగ రంజాన్. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తుంది.
కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తూ, దైవ చింతనతో గడిపే ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారు. ముస్లింలకు అల్లాహ్ దీవెనలు లభించాలని కోరుతున్నా. రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాక్షాంక్షలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంఓ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.