ప్రకాశం: మర్రిపూడి ఎస్‌ఐ దౌర్జన్యం కేసులో ట్విస్ట్‌ | Twist In Prakasam District Marripudi SI Shocking Behaviour With Woman, Check Full Story Inside | Sakshi
Sakshi News home page

ప్రకాశం: మర్రిపూడి ఎస్‌ఐ దౌర్జన్యం కేసులో ట్విస్ట్‌

Jun 3 2025 4:18 PM | Updated on Jun 3 2025 5:03 PM

Prakasam District: Twist In Marripudi Si Assault Case

సాక్షి, ప్రకాశం జిల్లా: రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో సామాన్యుల పట్ల పోలీసుల దాడులు పెరిగిపోతున్నాయి ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో మర్రిపూడి ఎస్‌ఐ ఎ.రమేష్‌బాబు మహిళపై దౌర్జన్యం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లోకి చొరబడి మహిళపై చేయివేసి విసిరిపడేసి.. అమర్యాదగా ప్రవర్తించిన ఎస్సై రమేష్ బాబును ఎస్పీ వెనుకేసుకొచ్చారు.

బాధితులపైనే కేసులు పెడుతున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియా ముందు ప్రకటించారు. దళిత ఎస్‌ను అడ్డగించి విధులకు ఆటంకం పరిచారంటూ ఇద్దరు మహిళలతో పాటు ఇంటి యజమాని మారంరెడ్డి కొండలరావుపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

కాగా, ఈ కేసులో జాళ్లపాలెం గ్రామానికి చెందిన మారంరెడ్డి కొండలరావు అదేరోజు కొండపి పోలీస్‌స్టేషన్‌కు, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యా­దు చేసినా ప్రయోజనం లేకపోవటంతో సోమ­వారం జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. జాళ్లపాలెంలో మారంరెడ్డి కొండలరావు నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. గత నెల 28న కొండపి మండలం పెట్లూరు శివాలయంలో రూ.7 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, జరుగుమల్లి మండలం ఎన్‌ఎన్‌ కండ్రిక పంచాయతీ కొత్తపాలెం అంకమ్మ తల్లి ఆలయంలో రూ.70 వేల విలువైన వెండి వస్తువులు, హుండీలో సుమారు రూ.20 వేల నగదు చోరీకి గురయ్యాయి.

మర్రిపూడి ఎస్ఐ రమేష్ బాబు దౌర్జన్యం కేసులో ట్విస్ట్

ఈ కేసుల విచారణలో భాగంగా మర్రిపూడి ఎస్‌ఐ రమేష్‌బాబు జాళ్లపాలెం వెళ్లారు. కొండలరావు షాపు వద్ద సీసీ కెమెరా ఉన్నట్టు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులను సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించాలని కోరారు. వారు యజమాని కొండలరావు లేరని చెప్పగా.. ఎస్సై రమేష్‌బాబు వెంటనే కొండలరావు కుమారుని ద్వారా ఫోన్‌ చేయించి అతడితో మాట్లాడారు. కొండలరావు ఎస్‌ఐతో మాట్లాడుతూ తాను ఊళ్లో లేనని, సాయంత్రం వస్తానని, పెన్‌డ్రైవ్‌ ఇస్తే సీసీ ఫుటేజీ కాపీ చేసి పంపిస్తానని మర్యాదపూర్వకంగా చెప్పారు.

దీంతో ఎస్‌ఐ రమేష్‌బాబు తాను స్వయంగా సీసీ కెమెరా ఫుటేజీ చెక్‌ చేసుకుంటానని చెప్పడంతో ‘సార్‌ మీరు నా ఇంట్లోకి వెళ్లడానికి వీల్లేదు. మీ మీద నాకు నమ్మకం లేదు’ అని చెప్పాడు. దీంతో అహం దెబ్బతిన్న ఎస్సై ‘మా మీద నమ్మకం లేదా’ అనడంతో కొండలరావు ‘నమ్మకం లేదు. గత ఏడాది నవంబర్‌లో మర్రిపూడి మండలం జగ్గరాజుపాలెం పెట్రోల్‌ బంకులో నాపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే నన్ను మూడు గంటలపాటు నిలువరించటమే కాక మీరు నేరస్తుల పక్షాన నిలబడి నాపై తప్పుడు కేసు పెట్టమని సలహా ఇచ్చారు.

నేటి వరకు ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదు’ అనడంతో ఎస్‌ఐ ఫోన్‌ కట్‌ చేశారు. తరువాత కొండలరావు కుటుంబ సభ్యులపై ఎస్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎంత పొగరు. తలుపులు వేసేస్తారా’ అని తలుపులు నెట్టుకుంటూ షాపులోకి వెళ్లి కుటుంబ సభ్యులను కొట్టారు. షాపులో ఉన్న కొండలరావు చెల్లెలు చంద్రమ్మను చేతితో నెట్టుకుంటూ ఆమెను దూషిస్తూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి సీసీటీవీ ఎన్‌వీఆర్, మొబైళ్లు, పెన్‌డ్రైవ్‌లు జేబులో వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై కొండలరావు కొండపి పోలీస్‌స్టేషన్‌లోను, ఎస్పీకి వాట్సాప్‌ ద్వారా ఫిర్యా­దు చేశారు. అయినా ఇంతవరకు న్యాయం జరగలేదని, తక్షణమే విచారించి న్యాయం చేయటంతో పాటు దోషులను శిక్షించి తమ వద్ద లూటీ చేసిన ఆస్తులను రికవరీ చేసి ఇప్పించాలని మరోమారు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement