పీ–4లో మార్గదర్శుల సంఖ్య పెంచాలి | The number of guides in P 4 should be increased | Sakshi
Sakshi News home page

పీ–4లో మార్గదర్శుల సంఖ్య పెంచాలి

Jun 26 2025 5:36 AM | Updated on Jun 26 2025 5:36 AM

The number of guides in P 4 should be increased

ఎంపికైన బంగారు కుటుంబాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వే 

వందేళ్లలో దేశంలోనే తిరుగులేని రాజధానిగా అమరావతి     

రూ.500 నోట్లు రద్దు చేసి డిజిటల్‌ మనీని ప్రోత్సహించాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు

సాక్షి, అమరావతి :  సమాజంలో చాలామంది పేదలకు సాయం చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని.. అలాంటి వారికి పీ–4ను వేదికగా మార్చి మార్గదర్శకుల సంఖ్య పెంచాలని సీఎం చంద్రబాబునాయు­డు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచి్చన పీ–4 విధానం అమలుపై ముఖ్యమంత్రి బుధవా­రం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిత్యం పర్యవేక్షించేందుకు ప్రభు­త్వం కాల్‌ సెంటర్‌ను సిద్ధంచేసిందని చెప్పా­రు. బంగారు కుటుంబంగా ఎంపికైన వారి జీవిత ప్రమాణాలపై ఎప్పటికప్పుడు సర్వే చేయాలని సూచించారు.  

మార్గదర్శకుల భాగస్వామ్యం పెంచేందుకు టాప్‌–100 కంపెనీలకు చెందిన సీఈఓలు, సీఓఓలు, సీఎఫ్‌ఓ, ఎండీలు, చైర్మన్‌లతో నేరుగా తానే మాట్లాడి పిలుపునిస్తానన్నారు. దీంతోపాటు.. దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారితో వర్చువల్‌ విధానంలో సమావేశమై కార్యక్రమ ప్రాధాన్యత, ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించి మార్గదర్శకులుగా ముందుకొచ్చేందుకు ఆహ్వానిస్తానని చంద్రబా­బు చెప్పారు.  పీ–4 విధానంలో మే­లు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 19,15,771 బంగారు కుటుంబాలను గుర్తించగా వారిలో ఇప్పటివరకు 87,395 కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని అధికారులు వివరించారు.  

పెట్టుబడులకు ప్రోత్సాహకాలు.. 
వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు అందిస్తామని ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం ప్రకటించారు. వందేళ్లలో తిరుగు లేని రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. రూ.500 నోటు రద్దు చేసి డిజిటల్‌ మనీని ప్రోత్సహించాలన్నారు.   

గత ప్రభుత్వం మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. 
పెట్టుబడిదారులు గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనను మర్చిపోవాలని.. మళ్లీ ఆ ప్రభుత్వం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తున్నానని సీఎం చెప్పారు. ఐటీ, సేవల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) ప్రతినిధులను ఆహ్వానించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నాస్కామ్‌ ప్రతిని«­దులు సీఎంను కలిసి బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూ్యరెన్స్‌) రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించారు.   

స్వర్ణాంధ్ర పీ–4 ఫౌండేషన్‌గా స్మార్ట్‌ ఏపీ మార్పు 
స్మార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర పీ–4 ఫౌండేషన్‌గా మార్చి సీఎం అధ్యక్షతన రాష్ట్రస్థాయి పాలన కమిటీని ఏర్పాటుచేశారు. ఈ మేరకు ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో పలువురు మంత్రులు, పలు శాఖల అధికారులతో పాటు ప్రముఖ కార్పొరేట్లు, ట్రస్టులు, అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలు, ఎన్‌జీఓల నుంచి సభ్యులను నామినేట్‌ చేస్తారు. 

అలాగే, జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రతినిధులను, ప్రముఖ వ్యక్తులనూ నామినేట్‌ చేస్తారు. జిల్లా స్థాయిలో ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన ఎంపీలు, అధికారులతో కమిటీ ఏర్పాటుచేశారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల అధ్యక్షతన అధికారులతో కమిటీ ఏర్పాటుచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement