నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో పట్టపగలు మహిళ దారుణ హత్యకు గురైంది. సన్నిహితంగా ఉంటున్న వ్యక్తే అనుమానంతో ఆమెను కడతేర్చాడు. అనంతరం నిందితుడు పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసుల కథనం మేరకు.. కనుపర్తిపాడుకు చెందిన రేవతి (35)కి సుమారు 18 సంవత్సరాల క్రితం సుమన్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. విభేదాల నేపథ్యంలో ఐదేళ్ల క్రితం రేవతి భర్త నుంచి విడిపోయింది.
ఆమె పిల్లలతో కలిసి కనుపర్తిపాడులో తండ్రి వద్ద ఉంటోంది. ఈక్రమంలో అదే ప్రాంతానికి చెందిన కడప శ్రీకాంత్తో ఆమెకు పరిచయమైంది. ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల ఆమె మరొకరితో మాట్లాడుతుందన్న అనుమానంతో శ్రీకాంత్ తరచూ గొడవ పడేవాడు. ఎలాగైనా రేవతిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
కత్తితో పొడిచి..
మంగళవారం రేవతి కొండాయపాళెంలోని ఓ భవనంలో వాచ్మెన్గా పనిచేస్తున్న తన తండ్రికి భోజనం బాక్స్ ఇచ్చి స్కూటీలో పెట్రోల్ పట్టించుకుని వెళ్తానని బయటకు వచ్చింది అక్కడ శ్రీకాంత్ ఆమెను కలిశాడు. ఇద్దరూ పడారుపల్లి చెరువుకట్ట రేవు వద్దకు వెళ్లారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీకాంత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రేవతిపై పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందింది.
అనంతరం నిందితుడు నేరుగా వేదాయపాళెం పోలీస్స్టేషన్కు వెళ్లి తాను ఓ మహిళను హత్య చేశానని జరిగిన విషయం చెప్పాడు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడి కాలికి గాయమై ఉండటంతో అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్లో చేరి్పంచినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు.


