AP: ఈనామ్‌ బిడ్డింగ్‌లో మనదే రికార్డ్‌.. | Kurnool Market Yard Stood Number 1 In eNAM Mandis Trade | Sakshi
Sakshi News home page

ఈనామ్‌ బిడ్డింగ్‌లో మనదే రికార్డ్‌.. దేశంలో తొలి రెండుస్థానాల్లో ఆదోని, కర్నూలు మార్కెట్‌ యార్డులు

Jan 22 2023 8:42 AM | Updated on Jan 22 2023 8:51 AM

Kurnool Market Yard Stood Number 1 In eNAM Mandis Trade - Sakshi

సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈనామ్‌) బిడ్డింగ్‌లలో ఆంధ్రప్రదేశ్‌ దూసుకుపోతుంది. రికార్డుస్థాయిలో వ్యాపార లావాదేవీలు నిర్వహించడమే కాదు బిడ్డింగ్‌ల్లో కూడా రికార్డులు తిరగరాస్తోంది. కోటి బిడ్డింగ్‌లతో ఆదోని మార్కెట్‌ యార్డు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 45.63 లక్షల బిడ్స్‌తో కర్నూలు యార్డు రెండోస్థానంలో ఉంది. 2017–18లో ప్రారంభమైన ఈనామ్‌ దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా మండీ (మార్కెట్‌ యార్డు)ల్లో అమలవుతోంది. మన రాష్ట్రంలో 33 యార్డులు ఈనామ్‌ పరిధిలో ఉన్నాయి.

రాష్ట్రంలో 14.49 లక్షలమంది రైతులు, 3,532 మంది వ్యాపారులు, 2,302 మంది ఏజెంట్లు ఈనామ్‌లో రిజిస్టరయ్యారు. 203 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా ఈనామ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర పరిధిలో రూ.35 వేలకోట్ల విలువైన 58.74 లక్షల టన్నుల క్రయవిక్రయాలు ఈనామ్‌ ద్వారా జరిగాయి. ప్రధానంగా మిరప, పత్తి, పసుపు, నిమ్మ, టమాటా, బెల్లం, ఆముదం, ఉల్లి, వివిధరకాల పండ్లు, కూరగాయలను జాతీయస్థాయిలో రైతులు అమ్ముకుంటున్నారు. నాణ్యత పరీక్ష యంత్రాల ద్వారా ర్యాండమ్‌గా లాట్స్‌ నాణ్యతను పరీక్షించి ఆన్‌లైన్‌లోనే పరిమాణంతో సహా ప్రదర్శిస్తారు. విక్రయించిన రైతుల ఖాతాల్లో సొమ్ము నేరుగా జమ అవుతోంది.

ఆదోని యార్డు పరిధిలో ఇప్పటివరకు రూ.3,607.28 కోట్ల క్రయవిక్రయాలు ఆదోని యార్డు పరిధిలో మూడులక్షల మంది రైతులు, 503 మంది వ్యాపారులు, 429 మంది కమీషన్‌ ఏజెంట్లు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా పత్తి, వేరుశనగ, ఆముదం, పూలవిత్తనాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఆదోని పరిధిలో 50కి పైగా స్పిన్నింగ్‌ మిల్స్‌ ఉండడంతో వ్యాపారులు ఆదోని మార్కెట్‌ యార్డులో ఈనామ్‌ టెండర్‌లో పాల్గొని పత్తికి పోటీపడి బిడ్డింగ్‌లు నమోదు చేస్తుంటారు. ఈనామ్‌ ప్రారంభించినప్పటి నుంచి నేటివరకు రాష్ట్రంలో ఈనామ్‌ పరిధిలో ఉన్న 33 మార్కెట్‌ యార్డుల్లో 64.29 లక్షల లాట్స్‌ మార్కెట్‌కు వచ్చాయి.

వీటిలో ఒక్క ఆదోనిలోనే 11.34 లక్షల లాట్స్‌ ఉన్నాయి. ఈ సరుకు కోసం 300 మంది వ్యాపారులు పోటీపడగా, కోటి బిడ్డింగ్‌లు నమోదయ్యాయి. అత్యధికంగా 2020–21లో 2.26 లక్షల లాట్స్‌ కోసం 18.39 లక్షల బిడ్డింగ్స్‌ నమోదయ్యాయి. యార్డు పరిధిలో ఇప్పటివరకు రూ.3,607.28 కోట్ల విలువైన 6.97లక్షల టన్నుల వ్యవసా­యో­త్పత్తుల క్రయవిక్రయాలు జరిగాయి. రెండో స్థానంలో నిలిచిన కర్నూలు ఏఎంసీలో ఇప్పటివరకు 45.63 లక్షల బిడ్స్‌ నమోదయ్యాయి. ఈ యార్డు పరిధిలో రూ.1,536 కోట్ల విలువైన 3.89 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరిగాయి.

దేశంలో మూడోస్థానంలో నిలిచిన రాజస్థాన్‌లోని కోట మండీలో 36 లక్షల బిడ్స్‌ నమోదయ్యాయి. అరుదైన రికార్డు కోటి బిడ్డింగ్‌లను అధిగమించడం అరుదైన రికార్డు. అనతికాలంలోనే ఈ ఫీట్‌ను సాధించిన తొలి యార్డుగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో యార్డు పరిధిలో కల్పించిన మౌలిక వసతుల వలన పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుండడంతోపాటు వ్యాపారులకు నాణ్యమైన సరుకు లభిస్తోంది.
– బి.శ్రీకాంత్‌రెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్‌ యార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement