సాక్షి,కృష్ణాజిల్లా: విజయవాడలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మాజీ ఎంపీ నాని వరుసగా మూడు రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రస్తుత ఎంపీ చిన్నిపై తీవ్ర విమర్శలు చేశారు.
నాని తన ఫేస్బుక్ పోస్టులో ‘చిన్ని చీకటి సామ్రాజ్యం భయం నీడలో బెజవాడ’ అంటూ ఇమేజ్ షేర్ చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం.. చిన్ని అక్రమ వసూళ్లు, ఇసుక రేషన్, సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందుకోసం చిన్ని రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి ప్రజలపై ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపించారు.
నాని తన పోస్టులో కేశినేని చిన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. వాణిజ్య సముదాయాలు, ఆస్తి విభాగాల్లో కూడా చిన్ని జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. చివరగా, నాని ఈ అంశాలపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కోరారు.


