
పూల చాదర్ సమర్పిస్తున్న డిప్యూటీ సీఎం అంజాద్బాషా, కలెక్టర్ విజయరామరాజు
కడప కల్చరల్: దేశంలో ప్రముఖ సూఫీ పుణ్యక్షేత్రమైన వైఎస్సార్ జిల్లా కడప అమీన్పీర్ దర్గాలోని హజరత్ సూఫీ సరమస్త్సాని చల్లాకష్ ఖ్వాజా సయ్యద్షా ఆరీఫుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రి సాహెబ్ ఉరుసు ఉత్సవాలు ఆదివారం రెండోరోజు ఘనంగా కొనసాగాయి. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషా ప్రభుత్వం తరఫున చాదర్ సమర్పించారు.
పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ పర్యవేక్షణలో ఆయన సంప్రదాయబద్ధంగా ఫకీర్ల మేళతాళాలు, విన్యాసాలు, నాత్ గీతాలాపనల మధ్య ఊరేగింపుగా దర్గా వద్దకు చాదర్ను తీసుకెళ్లారు. పీఠాధిపతి ఆధ్వర్యంలో గురువుల మజార్ వద్ద గంధంతోపాటు చాదర్ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, ఫాతెహా చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు, నగర ప్రముఖులు, దర్గా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.