సాక్షి, పాయకరావుపేట: ఏపీలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ను టార్గెట్ చేసి దాడి చేయాలనే ఉద్దేశ్యంతో హల్చల్ చేస్తున్నారు. తాజాగా నక్కపల్లి పోలీసు స్టేషన్ వద్ద జనసేన కార్యకర్తలు గుమ్మిగూడి.. రావణ్ను తమకు అప్పగించాలని నినాదాలు చేస్తున్నారు.
ప్రశ్న రావణ్పై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు కొనసాగుతోంది. రావణ్పై వరుస కేసుల్లో భాగంగా పోలీసులు.. నక్కపల్లి పోలీసు స్టేషన్కు తీసుకువచ్చారు. దీంతో, జనసేన కార్యకర్తలు.. నక్కపల్లి పీఎస్ వద్దకు చేరుకుని అత్యుత్సాహం ప్రదర్శించారు. రావణ్ను తమకు అప్పగించాలని నినాదాలు చేశారు. రావణ్పై దాడి చేసేందుకు వారంతా కోడిగుడ్లతో అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు.. రావణ్ వ్యవహారంలో పోలీసుల పక్షపాత ధోరణి చూపిస్తున్నారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ ముందు జనసేన కార్యకర్తలు ఓవరాక్షన్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్ను ముట్టడించినా వారి వైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. కానీ, రావణ్ చూసేందుకు వచ్చిన వారిపై మాత్రం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రావణ్ మనుషులు పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారిని బలవంతంగా కారు ఎక్కించి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, రావణ్ మనుషులపై జనసేన శ్రేణులు బూతులతో రెచ్చిపోతున్నారు. అంతటితో ఆగకుండా రావణ్ మనుషులపై దాడికి ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం.. జనసేన నేతల వ్యవహార శైలిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.


