శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ | Huge rally in Srikalahasti | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ

Apr 7 2021 5:05 AM | Updated on Apr 7 2021 5:05 AM

Huge rally in Srikalahasti - Sakshi

మోటార్‌ సైకిల్‌ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు. (ఇన్‌సెట్‌లో) ర్యాలీలో పాల్గొన్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి

రేణిగుంట (చిత్తూరు జిల్లా): తిరుపతి పార్లమెంటరీ స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంట నుంచి సుమారు 2 వేల బైక్‌లతో ఏర్పేడు, శ్రీకాళహస్తి పట్టణం, ఆయా మండలాల పరిధిలోని గ్రామాల మీదుగా పాపానాయుడుపేట వరకు 30 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. ఉదయం ప్రారంభమైన ఈ ర్యాలీ రాత్రి వరకు కొనసాగింది. రేణిగుంట ఓవర్‌ బ్రిడ్జి వద్ద టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ మద్దెల గురుమూర్తి ర్యాలీని ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ర్యాలీగా వస్తున్నారని తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి ‘జై జగన్‌’ అంటూ నినదించారు. 

వైఎస్సార్‌సీపీని ఆశీర్వదించండి
రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కోరారు. శ్రీకాళహస్తికి చెందిన గురుమూర్తికి పార్టీ అధినాయకత్వం ఎంపీ టికెట్‌ ఇవ్వడం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. స్థానిక సమస్యలపై ఆయనకు అవగాహన ఉందని, ఆయనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధికి పాటుపడుతారన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ పెద్దలు నివ్వెరపోయేలా గురుమూర్తిని రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement