పద్మావతి ఏజెన్సీ బాధిత పారిశుద్ధ్య కార్మికుల ఆవేదన
వైఎస్సార్సీపీ నేత సజ్జలను కలిసి గోడు వెళ్లబోసుకున్న వైనం
సాక్షి, అమరావతి: అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించి పద్మావతి ఏజెన్సీ తమ పొట్టకొట్టిందని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతోసహా రాయలసీమ జోన్లోని పలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో దశాబ్దాలుగా పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి సమావేశమై గోడును వెళ్లబోసుకున్నారు.
తమ ఆవేదనను మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. బాధిత కార్మికులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని సజ్జల వారికి హామీ ఇచ్చారు. బాధితులు మాట్లాడుతూ కరోనా మహమ్మారిసహా ఎన్నో క్లిష్ట సమయాల్లో దశాబ్దాలుగా ప్రజాసేవలు అందించిన తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల ఆవేదన ఇది..
‘కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతోసహా రాయలసీమ జోన్లోని పలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో దశాబ్దాలుగా పని చేస్తున్న దాదాపు 500 మంది పారిశుద్ధ్య కార్మికులం ఇప్పుడు రోడ్డున పడ్డాం. ఒక్క కర్నూల్ జీజీహెచ్లో ఈ సంఖ్య దాదాపు 50గా ఉంది. ‘50 ఏళ్ల వయసు’ పేరుతో ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా అర్ధంతరంగా మమ్మల్ని విధుల నుంచి తొలగించారు.
సీఎం సమీప బంధువు ఒకరు ‘పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ ఏజెన్సీ’ పేరుతో పారిశుద్ధ్య కార్మికుల కాంట్రాక్ట్ను చేజిక్కించుకున్న నేపథ్యం మాకు శాపంగా మారింది.అయితే ఏజెన్సీ కొత్త వారిని చేర్చుకుంటూ వారి దగ్గర నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేస్తోంది. 54 ఏళ్లు ఉన్న వారిని కూడా కొత్తగా పనిలోకి చేర్చుకుంటున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి మద్దతు ఇచ్చిన వారినికూడా పనిలోంచి తీసేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. రాయలసీమ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6 వేల మందికి పైగా పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు రూ.13,640 జీతం పొందుతున్నారు. వీరిలో చాలా మంది 25 ఏళ్లకు పైగా, రూ.400 ప్రారంభ జీతం ఉన్నప్పటి నుంచి ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది’ అని కార్మికులు తెలిపారు.
50 ఏళ్ల వయో పరిమితి దారుణం..
ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు ఉండగా, పారిశుద్ధ్య కార్మికులకు 50 ఏళ్లకే పరిమితి విధించడం ఏ మేరకు సమంజసమని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా చట్టవిరుద్ధంగా ఈ నిబంధనను చేర్చారని విమర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని ఇతర జోన్లలో లేని ఈ 50 ఏళ్ల నిబంధన కేవలం రాయసీమ జోన్లో మాత్రమే ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏజెన్సీ యాజమాన్యం తమకు రాజకీయ పెద్దల అండ ఉందంటూ అక్రమాలకు పాల్పడుతోందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.


