రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు పదవి?: వైఎస్‌ జగన్‌ | Former CM YS Jagan fires on CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు పదవి?: వైఎస్‌ జగన్‌

Oct 2 2025 5:51 AM | Updated on Oct 2 2025 6:09 AM

Former CM YS Jagan fires on CM Chandrababu Naidu

సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ధ్వజం

ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులు వేస్తుంటే మీకు కనీసం చీమకుట్టినట్టైనా లేదు 

కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నా పట్టదా? 

ఇప్పటికైనా మేల్కొని మీకున్న ఎంపీల బలంతో కేంద్రంపై ఒత్తిడి తేవాలి 

ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతోపాటు కేడబ్ల్యూడీటీ–2లో సమర్థ వాదనలు వినిపించాలి 

లేదంటే భావితరాల మనసుల్లో చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయం

సాక్షి, అమరావతి: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం చకచకా అడుగులేస్తుంటే సీఎం చంద్రబాబుకు కనీసం చీమ కుట్టినట్టైనా లేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య­మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండి­పడ్డారు. ఎత్తు పెంచడం వల్ల ఆల్మట్టి సామర్థ్యం 129.72 నుంచి 279.82 టీఎంసీలకు పెరుగుతుందని.. దీనివల్ల రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయో­జనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి? అంటూ చంద్రబాబును నిలదీశారు. 

ఇప్పటికైనా మేల్కొని ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబుకు హితవు పలికారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతోపాటు, కేడ­బ్యూ­డీటీ–2 విచా­రణపై దృష్టి పెట్టి సమర్థంగా వాదనలు వినిపించేలా చర్యలు తీసుకోవా­లని సూచించారు. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయమని చంద్రబాబును హెచ్చరించారు. ఈమేరకు వైఎస్‌ జగన్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..

» చంద్రబాబు గారూ..  మీరు రాష్ట్ర ప్రయోజనా­లను పూర్తిగా గాలికొది­లేశారు. రాష్ట్ర హక్కు­లను కాపాడే ఉద్దేశం మీలో ఏ కోశానా కనిపించడంలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి కర్ణాటక ప్రభు­త్వం చకచకా అడుగు­లేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమో­దం తెలుపుకుంటే,  కనీసం మీకు చీమకు­ట్టినట్టైనా లేదు. అనేక ప్రాంతాలు సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారి­పోయే ప్రమాదం ఉన్నాసరే మీరెందుకు పట్టనట్టు వ్యవహరిస్తు­న్నారు? రాష్ట్ర హక్కులను కాపా­డాల్సిన స్థానంలో ఉన్న మీరే, రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడ­లేకపోతే మీకెందుకు ఆ పదవి?

» గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 నుంచి 524.256 మీటర్లకు పెంచి నీటిని నిల్వ చేయడానికి అవసరమైన పనులు, స్పిల్‌వే సహా, గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే.. అప్పట్లోనూ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా, మీ ఎంపీల బలంమీదే నాటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా, 1995–2004 వరకూ కేంద్రంలో చక్రం తిప్పినట్లు మీకు మీరే గొప్పలు చెప్పుకున్న కాలంలో మీకున్న రాజకీయ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడలేదన్నది నిజమే కదా? 

సుప్రీంకోర్టు ఆదేశాలతో 519 మీటర్లకు పరిమితం అయినా, చివరకు మీ హయాంలోనే తాను కోరుకున్న స్థాయిలో ఆల్మట్టి స్పిల్‌వే సహా  గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు కర్ణాటక ప్రభుత్వం పూర్తి చేసిందనేది వాస్తవం కాదా?   

»  గత రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బ తింటున్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మీ వైఫల్యాల పుణ్యమే కదా చంద్రబాబూ? ఇప్పుడు మళ్లీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, మళ్లీ ఆల్మట్టిలో 519 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు ఎత్తు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది. 

నీటి నిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు.. దీనికోసం రానున్న మూడేళ్లలో రూ.70 వేల కోట్లు ఖర్చు చేయాలని నిశ్చయించింది. ఇంత జరుగుతున్నా మీలో కదలిక కనిపించడం లేదు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మీరు చక్రం తిప్పుతున్నారని మీరు, మీ ఎల్లోమీడియా రోజూ ప్రచారం చేసుకుంటున్నారు.

మీ ఎంపీల బలం మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న మాట కూడా వాస్తవమే. మరి అలాంటప్పుడు మీకున్న రాజకీయ బలాన్ని ఉపయోగించి, ఒత్తిడి తెచ్చి తద్వారా పనుల నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? ఎత్తు పెంపును ఆమోదిస్తూ కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబరు 16న నిర్ణయం తీసుకుంటే ఇప్పటివరకూ మీరెందుకు స్పందించడం లేదు? అసలు రాష్ట్రం అంటే మీకు పట్టింపు ఉందా? లేదా? 

» మరోవైపు జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటైన కృష్ణా జలవివాద ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ–2 ) ముందు రాష్ట్రం తర­ఫున వినిపిస్తున్న వాదనలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. కృష్ణా నదిలో బచావత్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ –1) 75 శాతం లభ్య­త ఆధారంగా (నికర జలాలు) కేటాయించిన జలాలను కొన­సాగిస్తూనే 65 శాతం లభ్యత ఆధారంగా (మిగులు జలా­లను) పంపిణీ చేస్తూ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూ­డీటీ–2) తీ­ర్పు అమల్లోకి వస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది. 

ఆ స్థాయిలో నీటి లభ్యత పరిగణనలోకి తీసుకున్న పరిస్థితుల్లో, దాన్ని ప్రామాణికంగా తీసుకుని కేటాయింపులు  చేయడం వల్ల రాష్ట్రా­నికి ఊహించని విధంగా నష్టం జరుగుతుంది. కరువు వస్తే రాష్ట్ర­మే భరించాలి. ఎలాగూ దిగువ రాష్ట్రం మనదే కాబట్టి వరద వచ్చి­నా రాష్ట్రమే ఆ నష్టాన్ని భరించే విధంగా ప్రస్తుతం ఉన్న ప్రతి­కూల పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. 

దీన్ని గుర్తించి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023 అక్టోబరులోనే పిటిషన్‌ దాఖలు చేసి న్యాయ పోరాటాన్ని ప్రారంభించింది. కానీ మీరు ఇప్పుడు సమర్థంగా వాదనలు వి­నిపించి రాష్ట్ర హక్కులను కాపాడటంలో చిత్తశుద్ధి చూపడం లేదు.

» చంద్రబాబూ.. మీరు ఇప్పటికైనా మేలుకోండి. కేంద్రంలో ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతోపాటు కేడబ్ల్యూడీటీ–2 విచారణపై దృష్టి పెట్టి సమర్థ వాదనలు వినిపించండి. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement