కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి భవానీపురంలో 42 ఇళ్లు కూల్చివేత
2.17 ఎకరాల భూమిపై కన్నేసిన ‘పచ్చ’నేతలు
చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో పేదలపై కత్తి
బాధితులు కాళ్లావేళ్లాపడ్డా కనికరించని పోలీసులు, అధికారులు
కూల్చివేతల వెనుక రూ.కోట్లు చేతులు మారినట్టు విమర్శలు
ఎమ్మెల్యే కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆందోళన
చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లిన బాధితులు
విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
‘‘ నాపేరు డి.నాగరాజు. తినీతినక కష్టపడిన సొమ్ముతో 9 ఏళ్ల క్రితం విజయవాడ జోజినగర్లో స్థలం కొనుక్కున్నాను. కార్పొరేషన్లో ప్లాన్ తీసుకొన్నాను. బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకున్నా. నా కళ్లముందే ఆ ఇంటిని బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఈ నెలాఖరు వరకు సమయం ఉందని కోర్టు ఉత్తర్వు చూపించినా కోర్టు అమీనాగానీ, పోలీసులుగానీ పట్టించుకోలేదు.
కోర్టు ఆర్డర్ కాపీని ఫోన్లో చూపిస్తుంటే లాయర్, అమీనా వెటకారంగా మాట్లాడారు. వ్యవస్థలు అమ్ముడు పోతుంటే నాలాంటి సామాన్యులు ఎలా బతకాలి? నాలుగు నెలల నుంచి నరకం చూపించారు. ఉన్న పళంగా నడిరోడ్డుపైకి నెట్టారు’’ – ఇదీ చంద్రబాబు పాలనలో ఓ బాధితుడి ఆక్రోశం
సాక్షి ప్రతినిధి,విజయవాడ/భవానీపురం(విజయవాడపశ్చిమ): చంద్రబాబు కూటమి ప్రభుత్వం పేద కుటుంబాలపై కత్తిగట్టింది. కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి బలవంతంగా విజయవాడ జోజినగర్లోని 42 ఇళ్లను బుధవారం నేలమట్టం చేసింది. రూపాయిరూపాయి కూడబెట్టుకొని, స్థలం కొని ఇళ్లు కట్టుకొన్న పేదల జీవితాలను రోడ్డు పాలు చేసింది. విజయవాడ నడిబొడ్డున్న ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే 2.17 ఎకరాల స్థలంపై కన్నేసిన పచ్చనేతలు పక్కా ప్రణాళికతో వ్యవస్థలను మెనేజ్ చేశారు.
చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి డైరెక్షన్లో సుప్రీం కోర్టులో స్టే ఉన్నప్పటికీ ఆగమేఘాలపై 42 ఇళ్లను నేలమట్టం చేశారు. పేదలను నడిరోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఈ తతంగం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్లు భాదితులు బహిరంగానే విమర్శిస్తున్నారు.
బహుళ అంతస్తుల నిర్మాణం కోసమే!
విజయవాడ నడిబొడ్డున జోజినగర్లో ఉన్న ఈ భూమి రూ.కోట్లు విలువ చేస్తుంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నుంచి ఈ స్థలాన్ని తొలుత ఒకరికి అగ్రిమెంటు చేశారు. వారు స్పందించక పోవడంతో 1980 ప్రాంతంలో స్థల యజమాని మరో వ్యక్తికి విక్రయించారు. ఆ కొనుగోలు చేసిన వ్యక్తి ప్లాట్లు వేసి 42 మందికి విక్రయించి రిజి్రస్టేషన్లు చేశారు. ఇందులో కార్పొరేషన్ నుంచి ఇళ్ల నిర్మాణకోసం అవసరమైన అనుమతులు, విద్యుత్, తాగునీరు కనెక్షన్లు తీసుకున్నారు.
బ్యాంకు నుంచి రుణాలు పొంది ఇళ్లు నిరి్మంచుకున్నారు. వీటిలో చాలా ఇళ్లు ఇప్పటికే పలువురి చేతులు మారి రిజి్రస్టేషన్లు జరిగాయి. అయితే స్థలం తొలుత అగ్రిమెంటు చేసుకున్న వ్యక్తి నుంచి పొందిన కాగితాల సాయంతో పచ్చనేతలు దొడ్డిదారిన ఓ సొసైటీని ఏర్పాటు చేసి, వారికి అనుకూలంగా అన్ని రకాల పత్రాలు సిద్ధం చేసుకుని చక్రంతిప్పారు. కోర్టు ద్వారా స్థలాన్ని కాజేయడానికి తీవ్ర యత్నం చేసి సఫలీకృతులయ్యారు.
బహుళ అంతస్తుల నిర్మాణానికి బెంగళూరుకు చెందిన బడా వ్యక్తులు, చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి డైరెక్షన్లో బుల్డోజర్లతో కూల్చివేతలకు ఒడిగట్టారు. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. ఒకవేళ తమ రిజిస్ట్రేషన్లు అక్రమమైతే వాటిని చేసిన అధికారులపైనా, భవన నిర్మాణానికి అనుమతులిచ్చిన మున్సిపాలిటీ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆందోళన ఉద్ధృతం
ఇళ్లు కోల్పోయిన బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆందోళనలను వారు ఉద్ధృతం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ గోడు వినిపించుకునేందుకు బాధితులు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లారు. అయితే వారిని పోలీసులు అనుమతించలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. కూల్చివేతలపై స్టే ఉందని, తాము ఖాళీ చేసేందుకు ఈనెలాఖరు వరకు సమయం ఉందని చెప్పినా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీంలో బుధవారం వాదనలు ఉన్నాయని, నాలుగు గంటలపాటు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గురువారం ఉదయం భవానీ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అధికారులు అసభ్యంగా ప్రవర్తించారని, శ్రీలక్ష్మి రామ కో–ఆపరేటివ్ సొసైటీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత బాధితులు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయానికి వెళ్లి «న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ఎన్నికల సమయంలో తమ సమస్యను వివరిస్తే న్యాయం చేస్తామన్న కూటమి నేతలు ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


