రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే: కేంద్రం | Counter Affidavit By Central Home Affairs In AP Highcourt About Capital Issue | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే: కేంద్ర హోంశాఖ

Aug 6 2020 11:39 AM | Updated on Aug 6 2020 6:19 PM

Counter Affidavit By Central Home Affairs In AP Highcourt About Capital Issue - Sakshi

రాజధాని అంశంపై ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ గురువారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

సాక్షి, అమరావతి : రాజధాని అంశంపై ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ గురువారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. రాజధాని నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది.

కాగా రిట్‌ పిటిషన్‌ 20622/2018కు ప్రతిగా కేంద్ర హోంశాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం 2014లో శివరామకృష్ణన్‌ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ‘రాజధాని ఎక్కడ పెట్టాలన్న దానిపై శివరామకృష్ణన్‌ కమిటీ పరిశీలన జరిపింది. ఆగస్టు 30, 2014న ఈ కమిటీ రాజధాని విషయమై నివేదిక సమర్పించింది. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు. జులై 31, 2020న ఏపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ చేసింది. పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి ఒక గెజిట్‌ను విడుదల చేసింది. గెజిట్‌ ప్రకారం ఏపీలో మూడు పాలనా కేంద్రాలుంటాయి. గెజిట్‌ ప్రకారం శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును పేర్కొన్నార’ని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. (ప్రభుత్వంపై ఆరోపణలన్నీ ఉపసంహరించుకుంటున్నా)

Advertisement
 
Advertisement
Advertisement