నిర్మాణాలను నిలిపివేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆవరణల్లో వాణిజ్య సముదాయాల నిర్మాణాలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లి పాఠశాల వద్ద రూ.50 లక్షలతో, వి.కోట పాఠశాల వద్ద రూ.25 లక్షల అంచనా వ్యయంతో వాణిజ్య సముదాయాలను నిర్మించాలని అధికారులు నిర్ణయించారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ విశ్రాంత ఉపాధ్యాయుడు నారాయణరెడ్డి సోమచంద్రరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ ఈ నిర్మాణాల వల్ల విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిర్మాణాలను చేపట్టవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.


