‘యంత్రసేవ’ పరికరాలు రైతులకు అందుబాటులో ఉండాలి: సీఎం జగన్‌

CM YS Jagan Review on Agri Infra, Grain Collection and CM App - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అగ్రి ఇన్‌ఫ్రా, ధాన్యం సేకరణ, సీఎం యాప్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆర్బీకేల పరిధిలో యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీకూడా రైతులకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సంబంధిత ఆర్బీకేల పరిధిలో ఉన్న యంత్రాలు ఏంటి? పరికరాలు ఏంటి? వాటిద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న వివరాలు ఆర్బీకేల్లో ఉంచాలన్నారు.

ఈ వివరాలతో సమగ్రమైన పోస్టర్లను ఆర్బీకేల్లో డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న యంత్రాలు, వాటి సేవల వివరాలను సమగ్రంగా రైతులకు తెలియజేసేలా ఈ పోస్టర్లను రూపొందించాలని పేర్కొన్నారు. వైయస్సార్‌ యంత్రసేవ కింద పంపిణీ చేసిన వ్యవసాయ ఉపకరణాల వివరాలను అధికారులు సీఎం జగన్‌కు అందించారు.

10,750 ఆర్బీకేల పరిధిలో ఇప్పటికే 6525 ఆర్బీకేల్లో యంత్రసేవ కింద వ్యవసాయ ఉపకరణాల పంపిణీ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలిపారు. 1615 క్లస్టర్‌ లెవల్‌ సీహెచ్‌సీల్లో 391 చోట్ల ఇప్పటికే యంత్రసేవ కింద హార్వెస్టర్లతో పాటు పలు రకాల యంత్రాలు ఆర్బీకేలకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రూ. 690.87 కోట్ల విలువైన పరికరాలు ప్రభుత్వం అందించగా.. ఇందులో 240.67కోట్ల సబ్సిడీ అందించినట్లు చెప్పారు. మిగిలిన ఆర్బీకేల్లో కూడా 2022–23కు సంబంధించి యంత్ర సేవకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు.

► సుమారు 7 లక్షల మందికి యంత్రాలు, పరికరాలు ఇచ్చేందుకు సిద్దంగా కార్యాచరణ. 
►80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు యంత్రసేవకింద పరికరాలు, మిగిలిన 20శాతం మిగిలిన వారికి.
►షెడ్యూల్డ్‌ ఏరియాల్లో 80శాతం ఎస్టీ రైతులకు ఇవ్వాలని నిర్ణయం.
►ఆర్బీకే యూనిట్‌గా వీటి పంపిణీ జరగాలన్న సీఎం.
► దీనికోసం రూ.1325 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.1014 కోట్లు.

►ఆర్బీకేల పరిధిలో  కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌రూమ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి అధికారులకు సీఎం ఆదేశం 
►వీలైనంత త్వరగా వీటి నిర్మాణాలు పూర్తిచేయాలన్న సీఎం. 
►అలాగే ఆర్బీకేల్లో గోదాముల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని సీఎం ఆదేశం. 

►చేయూత ద్వారా సుస్థిర ఆర్థిక ప్రగతికి స్వయం ఉపాధి పథకాలు కొనసాగించాలన్న సీఎం. 
►వారికి పశువులను పంపిణీచేయడం ద్వారా పాల ఉత్పత్తి, విక్రయం తదితర వ్యాపారాల ప్రక్రియ కొనసాగాలన్న సీఎం.
►దీనివల్ల మహిళల్లో ఆర్థిక స్వావలంబన జరుగుతుందన్న సీఎం. 
► అమూల్, అలానా లాంటి కంపెనీలతో భాగస్వామ్యం వల్ల లబ్ధిదారులైన మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం పొందేలా చూడాలన్న సీఎం.

అమూల్‌ పాలసేకరణపైనా సీఎం సమీక్ష. 
► 2,34,548 మహిళా రైతుల నుంచి అమూల్‌ పాల సేకరణ.
► ఇప్పటివరకూ 419.51 లక్షల లీటర్ల పాల సేకరణ.
► పాలసేకరణ వల్ల ఇప్పటివరకూ రూ.179.65 కోట్ల చెల్లింపు, రైతులకు అదనంగా రూ.20.66కోట్ల లబ్ధి.
►అమూల్‌ ప్రాజెక్టు వల్ల ఇతర డెయిరీలు పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి. 
► ఆయా డైరీలు ధరలు పెంచడంవల్ల రాష్ట్రంలో రైతులకు అదనంగా రూ.2,020.46 కోట్ల లబ్ధి. 

►వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు విస్తరించనున్న అమూల్‌ పాలసేకరణ
►అమూల్‌తో ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ 1.03 లక్షల లీటర్ల పాలసేకరణ.
►చిత్తూరు డెయిరీని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం ఆదేశం.

ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించిన సీఎం
►ఫేజ్‌–1లో చేపట్టిన జువ్వలదిన్నె, మచిలీపట్నం, నిజాంపట్నం పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయన్న అధికారులు.

ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష
►మిల్లర్ల పాత్రను పూర్తిగా తీసివేసేలా, పారదర్శకంగా జరిగేలా, రైతుల ప్రయోజనాలకు ఏ దశలోనూ భంగం రాకుండా ధాన్యం సేకరణ చేయాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు.
► సీఎం ఆదేశాల నేపథ్యంలో పలు విధానాలకు కసరత్తు చేసిన పౌరసరఫరాల శాఖ. వీటిని సీఎంకు వివరించిన అధికారులు.
► దీనికోసం విధి విధానాలు రూపొందించిన పౌరసరఫరాల సంస్థ. 
►ధాన్యం సేకరణలో భాగస్వామ్యం కానున్న వాలంటీర్లు. 
►వారి సేవలను వినియోగించుకున్నందుకు ఇన్సెంటివ్‌లు. 
►ఎస్‌ఓపీలను పకడ్బందీగా తయారు చేయాలన్న సీఎం. 

ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పశుసంవర్ధక, పాడిపరిశ్రామాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: (లోన్‌యాప్‌ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top