సాక్షి, పల్నాడు: చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన శుక్రవారం ఉదయం కూడా కొనసాగుతోంది. మృతుల కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాల నాయకులు, వేలూరు గ్రామస్తులు నిన్న సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున నిరసన కొనసాగిస్తున్నారు. దీంతో ఎన్ఆర్టీ సెంటర్లోని చెన్నై–కోల్కతా జాతీయ రహదారిపై ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన విరమించే ప్రసక్తే లేదని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంతో పాటు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చిలకలూరిపేటలో నిన్న సాయంత్రం 4.30 గంటల నుంచి ఆందోళన కొనసాగుతుండగా.. జాతీయ రహదారిపై సుమారు 12 గంటలుగా బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఉన్నామని.. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
ఎమ్మెల్యే రావాల్సిందే..
తమ వద్దకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే తమ వద్దకు వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించడంలో వెంటనే చొరవ చూపాలని దళిత సంఘాలు కోరుతున్నాయి.
సంబంధిత వార్త: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం
అధికారులతో చర్చలు
అంతకు ముందు.. ఆందోళన నేపథ్యంలో రాత్రి 11 గంటల సమయంలో డీఎస్పీ, ఆర్డీఓ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని అధికారులు కోరినప్పటికీ.. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తమ వద్దకు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సెంటర్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.
ఎంపీ మాటతో భగ్గుమన్న దళిత సంఘాలు
చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు నిరసన సెగ తగిలింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మృతుని బంధువులతో.. వినతిపత్రం ఇవ్వండి అంటూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. దీంతో ఎంపీ తీరు పట్ల మృతుల కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు చనిపోతే న్యాయం చేయడానికి వినతిపత్రం ఇవ్వాలా? అంటూ ఎంపీని వారు ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని ఎంపీ ముందు నినాదాలు చేయడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.
ఇదీ చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి..


