కాకినాడ క్రైం: పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, జగదీశ్వర్రెడ్డి హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జగదీశ్వర్రెడ్డికి అందించిన చికిత్స వివరాలు ఇవ్వాలంటూ ఆయన చికిత్స పొందిన ఆస్పత్రులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు.
కాకినాడలోని జన్మభూమి పార్కు సమీపంలో ఉన్న అహోబిల ఆసుపత్రికి, సర్పవరం జంక్షన్లో ఎస్కే ఆసుపత్రి, నాగమల్లితోట జంక్షన్లో ఉన్న ఇనోదయ ఆసుపత్రుల్లో జగదీశ్వర్రెడ్డి చికిత్స పొందగా ఆయా ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసి వివరాలు కోరారు. చికిత్స వేళ ప్రమాదకరమైన పదార్థాలు ఏవైనా శరీరంలో గుర్తించారా, అనుమానాస్పద రీతిలో ఆరోగ్య స్థితి ఉండడాన్ని గమనించారా వంటి ప్రశ్నలకు సమా«ధానంగా వైద్యులు అందించే ఆరోగ్య నివేదికలు దోహదపడనున్నాయి.
ఏం ఆర్డర్ పెట్టారు?
స్లోపాయిజన్ గుణాలున్న రసాయనంతో సాధిక్ సౌజన్యతో కలిసి జగదీశ్వర్రెడ్డి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎలా తెప్పించాడనే వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంప్రదాయ మార్గాలను ఎంచుకున్నాడా, మరెక్కడి నుంచైనా తెచ్చాడా అని ఆరా తీస్తున్నారు. ఇందుకు సౌజన్య, సాధిక్లు గడచిన మూడు నెలల్లో పెట్టిన ఆన్లైన్ ఆర్డర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడలో ఇన్స్టా మార్టు, బ్లింకిట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ సహా ఇతర ఆన్లైన్ డెలివరీ కార్యాలయాలకు సాధిక్, సౌజన్యల ఫోన్ నంబర్లతో ఇచ్చిన ఆర్డర్ హిస్టరీలు అడుగుతున్నారు. ఇందుకు అధికారికంగా నోటీసులు జారీ చేస్తున్నారు.
లావాదేవీలపై ఆరా...
సాధిక్ బ్యాంకు అకౌంట్లను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మతం మార్చడం, లవ్ జీహాద్, ఉగ్రవాదుల ప్రస్తావనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో అక్రమ మార్గాల్లో లేదా మరెవరి నుంచైనా సాధిక్ ఆర్థిక ప్రయోజనాలు పొందాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడి బ్యాంకు వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకుగాను, మెయిన్రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంకు సహా కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు నోటీసులు జారీ చేశారు. రేపు మరికొన్ని బ్యాంకులకు పోలీసుల నోటీసులు అందనున్నాయి.
సాధిక్ఖాన్ కస్టడీపై కౌంటర్ దాఖలు
కాకినాడ లీగల్: కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన షేక్ సాధిక్ఖాన్ను 7రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సర్పవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయవాది జవహర్ అలీ మొబైల్ కోర్టులో గురువారం కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగనుంది
పోలీసులు కనీస మర్యాద ఇవ్వడం లేదు : సాధిక్ఖాన్ సోదరి సాజిద
తమని స్టేషన్కి పిలిపిస్తున్న పోలీసులు హీనంగా చూస్తున్నారని, కనీస మర్యాద ఇవ్వడం లేదని సాధిక్ఖాన్ సోదరి సాజిద గురువారం ఆరోపించారు. అవమానకర రీతిలో మాట్లాడుతూ, నిలబెట్టే ప్రశ్నిస్తుండడం ఆవేదన కలిగిస్తోందన్నారు. స్టేషన్కు వెళ్లిన వెంటనే ఫోన్లు స్వాదీనం చేసుకోవడం, వాటిని ఇవ్వమంటే ముప్పుతిప్పలు పెట్టడం మానసిక క్షోభకు గురిచేస్తోందని తెలిపారు.
చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. నదిలో దూకిన దంపతులు!


