సమీక్షలో వివరాలు తెలుసుకుంటున్న మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానినీ కలుస్తాం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విజయవాడ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో ఇప్పటికే వేల మంది ప్రాణాలను కోల్పోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రోడ్లు, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి గురు వారం సమీక్షించారు. ఈ సందర్భంగా కోదాడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంతో పాటు ఇటీవల జరిగిన పలు ప్రమాదాలపై మంత్రి ఆరా తీశారు. హైదరాబాద్–విజయవాడ రహదారిలో గుర్తించిన 17 బ్లాక్ స్పాట్స్పై నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, హైమాస్క్ లైట్స్ పనుల పురోగతిని తెలుసుకున్నారు.
చిట్యాల ఫ్లైఓవర్ ఈ దసరా నాటికి పూర్తిచేయాలని, మిగతావి డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు. 6+2 రహదారి విస్తరణ కోసం ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు కలిశామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే తమ ధ్యేయమని, అందుకోసం తమకు ఎలాంటి భేషజాలు లేవు అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులతో కలిసి మరోసారి నితిన్ గడ్కరీని.. అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తామన్నారు.


