
సాక్షి, అమరావతి : అన్నమయ్య జిల్లాలో బయట పడిన నకిలీ మద్యం రాకెట్లో టీడీపీ కీలక నేతల ప్రమేయం బట్టబయలు కావడంతో సీఎం చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెర లేపారు. ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించి, పార్టీకి సంబంధం లేని వారిని బాధ్యులను చేయాలని చూసినా.. అది బెడిసి కొట్టింది. దీంతో టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తద్వారా ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, కింది స్థాయిలో ఏదో జరిగిందని ప్రజల దృష్టి మళ్లించేలా కొత్త కుతంత్రం రచించారు.
‘కల్తీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. భారీ యంత్రాలతో వివిధ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యాన్ని ఈ యూనిట్లో తయారు చేస్తూ ‘కీలక’ నేత అండతో వారు ఉమ్మడి చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ రాకెట్ బయట పడటంతో అమరావతి పెద్దలు తమకేమీ సంబంధం లేనట్లు.. స్థానిక నాయకులే కారణమంటూ డ్రామాలకు పూనుకోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.