సాక్షి, అమరావతి: చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. సున్నావడ్డీ ఉందో లేదో తెలియడం లేదన్నారు. బడ్జెట్ కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని.. 1 నుంచి 8 పేజీల వరకూ వాళ్ళను వాళ్ళు పొగుడుకోవడానికి, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సరిపోయిందంటూ దుయ్యబట్టారు.
ఈ బడ్జెట్లో ఎంతసేపూ చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లే చెప్పుకొచ్చారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? అంతా అంకెల గారెడీ అంటూ బొత్స నిలదీశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సున్నా వడ్డీ రుణాలు ఠంఛన్గా అందించాం.. ఈ ప్రభుత్వంలో వాటి ఊసే లేదు.. కేటాయింపులు లేవు. పనికి ఆహార పథకాన్ని నీరుగార్చే విధంగా కేటాయింపులు పెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో 3 లక్షల 20 వేల కోట్లు మాత్రమే అప్పులు చేశామని చెప్పాం. కానీ ఇప్పుడు 9 లక్షల కోట్లు వైఎస్సార్సీపీ హయాంలో అప్పులు చేశామని చెబుతున్నారు.
..బడ్జెట్ అంతా తప్పులు తడకగా ఉంది.. ఎంతసేపూ చంద్రబాబు, మోదీ, పవన్, లోకేష్ల పొగడ్తలే సరిపోయాయి. ఈ 20 నెలల కాలంలో 20 లక్షల ఐడెంటిటీ కార్డులు ఇచ్చి ఒక్క కౌలు రైతులకు అయినా నష్టపరిహారం ఇచ్చారా?. ఈ బడ్జెట్ వల్ల సమాజంలో ఏ ఒక్క వర్గానికి ఉపయోగం లేదు.. రాబోయే రోజుల్లో వీటి మీద పోరాడతాం. కచ్చితంగా మండలిలో చొక్కా పట్టుకొని నిలదీస్తాం. సమాధానాలు రాబడతాం’’ అని బొత్స పేర్కొన్నారు.


