సాక్షి,ఏలూరు: జంగారెడ్డిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. శనివారం వేగవరం సమీపంలో నిర్మాణ పనులు జరుగుతున్న ఓ ప్రైవేటు స్కూలు స్లాబ్ ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో 15మంది గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
స్థానికుల సమాచారం మేరకు.. నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులు స్లాబ్ వేసే పనులు చేస్తుండగా, అది ఒక్కసారిగా కూలిపోవడంతో సుమారు 15 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీసి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కొంతమంది కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూలు నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.


