టీటీడీ చైర్మన్ నీతిమాలిన పనులకు పాల్పడడం సిగ్గుచేటు
బీఆర్ నాయుడిపై భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం
తిరుపతి కల్చరల్: తన మాజీ డ్రైవర్ను నయానోభయానో అనుకూలంగా మలుచుకుని, తనపై దు్రష్పచారం చేయించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆయన సంస్థ టీవీ5 ప్రతినిధులు ప్రయత్నించారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. దీనిని నీతిమాలిన సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు. భూమన గురువారం మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రపంచ ప్రసిద్ధ ధార్మిక క్షేత్రమైన టీటీడీ ధార్మిక సంస్థకు ప్రథమ వ్యక్తిగా, చైర్మన్గా అత్యంత వినయ సంపన్నునిగా, శీలవంతునిగా ఉండాల్సిన నాయుడు అత్యంత నీచాతినీచమైన కార్యక్రమాలకు పాల్పడడం సిగ్గుచేటు.
నా వద్ద పనిచేసిన మాజీ డ్రైవర్కు టీవీ 5 ప్రతినిధులు కొందరు ఫోన్ చేసి తాము చెప్పినట్లు టీవీ 5లో మాట్లాడాలని సూచించినట్లు తెలిసింది. డ్రైవర్ను వారికి అనుకూలంగా మలుచుకునే క్రమంలో ఆయనను ప్రలోభపెట్టారని, భయపెట్టారని తెలిసింది. ఇలాంటి చర్యలకు నేను అదిరేది బెదిరేది లేదు. బీఆర్ నాయుడు చేస్తున్న అనైతిక, అరాచకాలను ప్రశ్నించే వైఎస్సార్సీపీ పైనా, వ్యక్తిగతంగా నాపైన అసత్య ప్రచారాలకు పూనుకుంటూ, కుట్రలకు పాల్పడడం దిగజారుడుతనానికి నిదర్శనం.
బీఆర్ నాయుడు తరహాలో పైరవీలు చేసి పైకి వచ్చిన వ్యక్తిని కాదు. జీవితం అంతా ఉద్యమాలు, పోరాటాలు చేసిన వాడిని. అనైతిక కార్యక్రమాలు చేసేవాడిని కాదు. బీఆర్ నాయుడు అనైతిక ప్రవర్తనను లోకమంతా చూశారు. ఒక ధార్మిక సంస్థకు చైర్మన్గా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం ఘోరాతి ఘోరం’ అని విమర్శించారు. బీఆర్ నాయుడు అనైతిక, అరాచక చర్యలపై నిరంతరం ఉద్యమం కొనసాగిస్తామని భూమన ఉద్ఘాటించారు.


