
చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో వ్యాపారుల అరాచకం
యూరియాకోసం కాంప్లెక్స్ను కొనాల్సిందేనని మెలిక
తీవ్ర ఇబ్బందుల్లో రైతాంగం
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో లేకలేక వర్షాలు పడ్డాయి. రైతులు సేద్యపు పనుల్లో బిజీగా మారారు. పంటలకు, పశుగ్రాసానికి యూరియా అవసరం ఎక్కువైంది. ఇదే అదునుగా పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్లోని ఎరువుల వ్యాపారులు యూరియాకు కృత్రిమ డిమాండ్ను సృష్టించారు. యూరియా బస్తా కావాలంటే.. కాంపె్లక్స్ ఎరువు బస్తా కొనాల్సిందేనని నిబంధన పెడుతున్నారు. దీంతో రైతులు విధిలేక యూరియా కోసం కాంప్లెక్స్ను కొనాల్సిన పరిస్థితి నెలకొంది.
రూ.1,300 నుంచి రూ.1,700 దాకా పెట్టికొన్న కాంప్లెక్స్ బస్తాలు దుకాణాల్లో అమ్ముడు కాకుండా వ్యాపారులకు భారంగా మారుతుండడం దీనికి కారణం. ప్రధాన డీలర్ల నుంచి స్థానిక వ్యాపారులకు కూడా ‘యూరియా కావాలంటే కాంప్లెక్స్ కొనాల్సిందేనన్న’ డిమాండ్ వస్తున్నట్లు సమాచారం.
రూ.250 యూరియా.. రూ.295కు విక్రయాలు
ఎమ్మార్పీ ప్రకారం యూరియా బస్తా ధర రూ.250గా ఉంది. కానీ ఇక్కడి దుకాణాల్లో వీటిని రూ.295 దాకా విక్రయిస్తున్నారు. ఎందుకని రైతులు ప్రశ్నిస్తే తమకు రేణిగుంటనుంచి యూరియా వస్తుందని అక్కడినుంచి ఇక్కడికి రవాణా, అన్లోడింగ్ చార్జీలు తప్పవని చెబుతున్నారు.
కృత్రిమ డిమాండ్, అధిక ధరల విషయంలో విజిలెన్స్ అధికారుల హెచ్చరికలనూ వ్యాపారులు బేఖాతరు చేయడం గమనార్హం. ఒకవైపు కృత్రిమ డిమాండ్, మరోవైపు అధిక ధరల నేపథ్యంలో ఈ ప్రాంత రైతులు కొందరు కర్ణాటకలోని నంగళి, ముళబాగిళు, బేతమంగళలకు వెళ్లి యూరియాను కొనుగోలు చేస్తున్నారు.
నిజమే కానీ...
యూరియా కావాలంటే.. కాంప్లెక్స్ కొనాల్సిందేనన్న షరతు వార్తలు నిజమే. ధరల విషయానికొస్తే రేణిగుంట నుంచి ట్రాన్స్పోర్ట్ చార్జీలను ప్రధాన డీలర్లకు ప్రభుత్వం ఇస్తే.. ఆ ప్రయోజనాన్ని రిటైల్ వ్యాపారులకు అందించాల్సి ఉంటుంది. ఈ డబ్బు రానందున కొంత ఇబ్బందిగా మారింది. కానీ ప్రభుత్వ నిబంధనల మేరకు ఎమ్మార్పీకే యూరియాను విక్రయించాలి. ఆయా అంశాలపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడతాం. – సాక్షితో స్థానిక వ్యవసాయశాఖ ఏడీ గీతాకుమారి