సాంకేతికతతో ‘పవర్‌’ఫుల్‌గా ప్రసారం

APTRANSCO Power companies Technology Andhra Pradesh - Sakshi

మరింత మెరుగ్గా విద్యుత్‌ ప్రసారానికి ‘సాంకేతిక’ సాయం

ప్రసార నష్టాలను 2.8 శాతంలోపు తగ్గించేందుకు చర్యలు

దేశంలోనే తొలిసారిగా సొంతంగా ఎనర్జీ ఫోర్‌ కాస్టింగ్‌ అభివృద్ధి

దీని ద్వారా భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాల అంచనా

ఈ సాంకేతికత కోసం పలు రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు

సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్‌కో సొంతంగా ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ.. నిర్వహణను సులభతరంగా మార్చుకుంటోంది. భవిష్యత్‌ విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రంలో ప్రసార వ్యవస్థ(ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌)ను మరింత బలోపేతం చేస్తోంది. నెట్‌వర్క్‌ మెయింటెనెన్స్, మానిటరింగ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ను సులభతరం చేసేందుకు జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(జీఐఎస్‌)ను అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది.

ఈ జీఐఎస్‌కు 63,000 టవర్లు, 30,010 సర్క్యూట్‌ కిలోమీటర్ల పొడవు లైన్లు, 358 ఎక్స్‌ట్రా హైటెన్షన్‌ సబ్‌స్టేషన్ల నెట్‌వర్క్‌ను అనుసంధానించింది. దీంతో మొత్తం నెట్‌వర్క్‌ నిర్వహణ సులభతరంగా మారింది. క్షేత్రస్థాయి అధికారుల విధులతో పాటు నెట్‌వర్క్‌ సమాచారాన్ని భౌగోళికంగా ఒకే ప్లాట్‌ఫాంపై మ్యాపింగ్‌ చేసింది. ఈ మ్యాపింగ్‌లను ఉపయోగించి డేటాను యాక్సెస్‌ చేయడం ద్వారా నిర్వహణ కార్యకలాపాలకు రూపకల్పన జరుగుతోంది. అలాగే జీఐఎస్‌ వల్ల ఫీల్డ్‌ ఇంజనీర్లకు ప్రాథమిక సర్వే నిర్వహించడం సులభంగా మారింది.

మరోవైపు తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయడానికి సహాయపడేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అంతర్గత డిమాండ్‌ అంచనా నమూనా(ఇన్‌హౌస్‌ ఎనర్జీ ఫోర్‌ కాస్టింగ్‌ మోడల్‌)ను కూడా అభివృద్ధి చేసింది. ఇది దాదాపు 99 శాతం కచ్చితత్వాన్ని కలిగి ఉంది. దీన్ని ఉపయోగించి విద్యుత్‌ అవసరాలను ముందే అంచనా వేస్తున్నారు. దీని ద్వారా విద్యుత్‌ సంస్థలు.. తమ కొనుగోళ్లలో కొన్ని రూ.కోట్లను పొదుపు చేసే అవకాశం ఉంది. ఏపీలో అభివృద్ధి చేసిన ఈ ఫోర్‌ కాస్టింగ్‌ మోడల్‌ దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ సంస్థల్లోనే మొదటిది. దీంతో అనేక రాష్ట్రాలు ఈ మోడల్‌ను తమకూ ఇవ్వాలని ఏపీని కోరుతున్నాయి.

సీఎం ఆశయానికి అనుగుణంగా.. 
– బి.శ్రీధర్, సీఎండీ,ఏపీ ట్రాన్స్‌కో
ఇటీవలే రెండు జాతీయ స్థాయి అవార్డులను గెల్చుకున్నాం. భవిష్యత్‌లోనూ విద్యుత్‌ ప్రసార నష్టాలను 2.8 శాతంలోపు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలనే సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయానికి అనుగుణంగా ఏపీ ట్రాన్స్‌కో ఉత్తమ సాంకేతిక విధానాలను అమలు చేస్తోంది. డిస్కంలకు ఇవి సహాయపడతాయి. ఏపీ ట్రాన్స్‌కో విధా­నాలను తమకూ చెప్పాలని తమిళనాడు, రాజస్తాన్‌ తదితర రాష్ట్రాలు కోరాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top