AP High Court On MP Raghu Rama Pending Complaint Details Petition, Details Inside - Sakshi
Sakshi News home page

AP: వాటిని బహిర్గతం చేయాలా?వద్దా? తేలుస్తాం: హైకోర్టు

Published Fri, Jan 20 2023 9:47 AM

AP High Court On MP Raghu Rama Pending Complaint Details Petition - Sakshi

సాక్షి, అమరావతి: పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేయకుండా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల వివరా­లను బహిర్గతం చేయాలా? వద్దా? అన్న అంశంపై లోతుగా విచారించి తేలుస్తామని హైకోర్టు తెలిపింది. అలా కేసులు నమోదు చేయకుండా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద తీసుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టు స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేసేందుకు హోం­శాఖ న్యాయవాది వి. మహేశ్వరరెడ్డి గడువు కోర­డంతో హైకోర్టు తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయ­మూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ గురు­వారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్లలో తనపై నమోదైన కేసుల వివ­రాలు, వాటికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ­లతో పాటు కేసులు నమోదు చేయని ఫిర్యాదుల వివ­రాలను తనకు అందజేసేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై జస్టిస్‌ రాయ్‌ గురువారం మరోసారి విచారణ జరి­పారు. రఘురామరాజు తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ వాదనలు వినిపిస్తూ, పెండింగ్‌లో ఉన్న ఫిర్యా­దుల ఆధారంగా కేసులు నమోదు చేసి వాటి­లో పిటిష­నర్‌ను అరెస్టుచేసే అవకాశం ఉందన్నారు. పిటిష­నర్‌ విషయంలో పోలీసులు కుట్ర­పూ­రితంగా వ్యవ­హ­రిస్తున్నారని, అందుకే ఆ ఫిర్యా­దుల వివరాలను వెల్లడించలేదన్నారు. ఈ వాద­నను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇది ఊహాజని­తమైన­దన్నారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి గడువునిస్తూ విచారణను పది రోజులకు వాయిదా వేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement