సీఎం సార్‌.. దేశ రక్షణలో ఉన్నా.. నా కుటుంబాన్ని రక్షించండి! | AP Army Solider BN Prasad Request Video To Chandrababu Over Land | Sakshi
Sakshi News home page

సీఎం సార్‌.. దేశ రక్షణలో ఉన్నా.. నా కుటుంబాన్ని రక్షించండి!

Jul 6 2025 7:06 AM | Updated on Jul 6 2025 1:38 PM

AP Army Solider BN Prasad Request Video To Chandrababu Over Land

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాకాలో పచ్చనేత భూకబ్జా నేపథ్యం

న్యాయం చేయాలంటూ సిపాయి సెల్ఫీ వీడియో  

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంటే, తన భూమిని ఓ రాజకీ­య నాయకుడు కబ్జా చేస్తున్నాడని, ఇందుకు అడ్డు­గా ఉన్నాడని తన తండ్రిపై దాడి చేశారని పేర్కొంటూ  సామాజిక మాధ్యమాల్లో  ఓసైనికు­డు పోస్టు చేసిన ఒక సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.  చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్ల అడ్డగోలు వ్యవహారాలకు ఈ వీడియో అద్దంపడుతోంది.

‘ముఖ్యమంత్రికి.. నా పేరు బీఎన్‌ ప్రసాద్‌. మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, కదిరివోబనపల్లి గ్రామం. నేను  పదేళ్లుగా దేశానికి సైని­క సేవలు అందిస్తున్నాను. మీరు మా గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంటికి ఎదురుగా మాకు ఒక ఎకరం ఇరవై సెంట్ల భూమి ఉంది. ఇందులోనే 15 సెంట్ల భూమిని రాజకీయ నాయ­కుడైన సుందరప్ప ఆక్రమించుకుని రీసర్వేలో నమోదు చేసు­కుని అతని భార్యకు రిజిస్ట్రేషన్‌ చేశాడు’ అ­ని వా­పోయాడు. తన సమస్యపై దృష్టి సారించిన అధికారులు సర్వే చేసి తనకు రావాల్సిన 15 సెంట్లకు ఫెన్సింగ్‌ వేసినట్లు తెలిపారు. అయితే  శనివారం ఉదయం తన తండ్రి బి.నారాయణప్ప పొలంలో పనిచేసేందుకు వెళ్లగా సుందరప్ప, ఆయన కుటుంబ సభ్యులు దాడిచేసినట్లు పేర్కొన్నాడు.  

సుందరప్పకు  ‘దేశం’ అండా‘దందా’.. 
సుందరప్ప టీడీపీలో కీలక నాయకుడు. భార్య నా­రాయణమ్మ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీచేశారు. కుమారుడు బీరేష్‌ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు. చంద్రబాబు ఇంటి నిర్మాణ పనుల్లోనూ వీరు చురుగ్గా పాల్గొన్నారు. దీంతో పైస్థాయి పార్టీ నేతలతో పరిచయాలు పెరిగా­యి. ఈ నేపథ్యంలో పరిష్కారమైన భూ వివాదాన్ని మళ్లీ తిరగదోడుతూ సుందరప్ప దాడులకు పా­ల్ప­డుతున్నాడని సమాచారం. సుందరప్ప కు­టుంబంతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని 2024 ఆగస్టులో ఇదే సైనికుడు ప్రసాద్‌ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు. దీనిపై కుప్పం పోలీసులు అప్పట్లో విచా­రణ జరిపి ఆ కుటుంబం జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. కానీ ఇప్పు­డు ఈ భూమికి ఎదురుగా సీఎం గృహప్రవేశం జరగటం, పలమనేరు–కృష్ణగిరి రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయనుండటంతో రియ­ల్టీ బూమ్‌ ఏర్పడింది. దీంతో మళ్లీ సుందరప్ప తన భూకబ్జా కుట్రలకు పదునుపెట్టాడు.

ఆర్మీ జవాన్ బి.ఎన్.ప్రసాద్ స్థలాన్ని ఆక్రమించిన టీడీపీ నాయకుడు సుందరప్ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement