రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
కౌంటర్ల దాఖలుకు ఆదేశం
పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా అభియోగాలు
పిటిషనర్ తరఫున న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు
సాక్షి, అమరావతి: తనను సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 20న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ సెక్రటరీ కాకర్ల వెంకటరామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. వెంకటరామిరెడ్డి డిస్మిస్ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ కమ్ విచారణాధికారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
డిస్మిస్ ఉత్తర్వుల రద్దుకు పిటిషన్...
తనను డిస్మిస్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయడంతో పాటు తక్షణం వాటి అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వెంకట రామిరెడ్డి తరఫున న్యాయవాది వేలూరు మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సర్వీసు నిబంధనలను ఉల్లంఘించి అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలతో వెంకటరామిరెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం సర్వీసు నుంచి డిస్మిస్ చేసింది.
పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషనర్పై అభియోగాలు మోపారు. పిటిషనర్ ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నమోదైన నాలుగు కేసులను కూడా తన డిస్మిస్ ఉత్తర్వులకు కారణంగా ప్రభుత్వం చూపింది. ఆ ఆరోపణలన్నింటిపై పిటిషనర్ ఇచ్చిన వివరణలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. విచారణాధికారి నిబంధనలు నిర్దేశించిన మేర విచారణ జరపలేదు. అభియోగాలను నిరూపించేందుకు సాక్షులను సైతం విచారించలేదు. ఆధారాలు లేకుండా విచారణాధికారి సమర్పించిన నివేదిక ఆధారంగా, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం పిటిషనర్ను సర్వీసు నుంచి డిస్మిస్ చేసింది’’ అని వివరించారు.


