అర్హతే ప్రామాణికం | Sakshi
Sakshi News home page

అర్హతే ప్రామాణికం

Published Wed, Dec 29 2021 4:12 AM

Andhra Pradesh  Govt Credits Welfare Schemes Money Directly To Beneficiary Account - Sakshi

సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా అనే ఆలోచన చేస్తే ఇప్పుడు మన ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూర్చుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గతంలో పథకాల కోసం ప్రజలు ఎదురు చూసేవారని ఇప్పుడు ప్రజలనే వెతుక్కుంటూ నేరుగా పథకాలు వస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. పథకాలు అమలు చేసేటప్పుడు కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడటం లేదని.. అర్హత ఉంటే చాలు అందరికీ అందాలనే కోణంలో ప్రతి అడుగూ వేస్తున్నామని చెప్పారు.

అర్హులు ఎవరూ మిగిలి పోకూడదని, అందరికీ ప్రయోజనం చేకూరాలన్న తపన, తాపత్రయంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. జనవరి 1వతేదీన పెంచిన పెన్షన్‌ రూ.2,500 అవ్వా తాతల చేతిలో పెడతామని  ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. కోవిడ్‌తో ప్రభుత్వ రాబడి గణనీయంగా తగ్గిపోయి ఖర్చులు పెరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తూ మానవత్వంతో వ్యవహరిస్తోందని చెప్పారు. అర్హులైనప్పటికీ ఏ కారణంతోనైనా సంక్షేమ పథకాలు అందనివారికి మరోసారి వెరిఫికేషన్‌ చేసి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో శ్రీకారం చుట్టారు. వివిధ పథకాల కింద అర్హులైన 9,30,809 మందికి రూ.703 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ముఖ్యమంత్రి జమ చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో లబ్ధిదారులనుద్దేశించి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలివీ..

+ తలుపు తట్టి..
మనందరికీ గుర్తుంది.. గతంలో సంక్షేమ పథకాల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఈరోజు సంక్షేమ పథకాలే పేదలను వెతుక్కుంటూ వారి ఇంటికి వచ్చి తలుపు తట్టి మరీ అందజేసే కార్యక్రమం మనందరి ప్రభుత్వంలో జరుగుతోంది. పథకాలు అమలు చేసేటప్పుడు ఎక్కడా కులం, మతం, ప్రాంతం చూడటంలేదు. రాజకీయాలు, పార్టీలు ఇవేవీ పట్టించుకోవడం లేదు. అర్హత ఉంటే చాలు పథకాలు అందరికీ దక్కుతాయని స్పష్టం చేస్తూ ప్రతి అడుగు వేస్తున్నాం. ఇంకా ఎక్కడైనా అర్హులై ఉండి కూడా దరఖాస్తు చేసుకోకపోవడమో, అర్హత నిర్ధారణలో పొరపాట్ల వల్లో, నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోకపోవడం, బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడమో... ఇలా కారణాలేవైనా కూడా సంక్షేమ పథకాలు అందకపోతే వారికి కూడా న్యాయం చేసేందుకు ఇవాళ ఈ కార్యక్రమం తలపెట్టాం. ఇదొక గొప్ప విప్లవాత్మక మార్పు.
 
+ ఎక్కడా లేని విధంగా..
గతంలో ప్రభుత్వాలు పథకాలను ఎలా కత్తిరించాలని చూసేవి. ఈరోజు అర్హత ఉన్నవారెవరూ మిగిలిపోకూడదు, పొరపాటున ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా ఎలా మంచి చేయాలనే ఆరాటం, తపన, తాపత్రయం మన ప్రభుత్వంలో కనిపిస్తోంది. దేశ చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ జరగని విధంగా పొరపాటున సంక్షేమ ఫలాలను అందుకోలేకపోయిన అర్హులైన పేదలకు మరో అవకాశం ఇచ్చాం. నెల రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించి వారికి కూడా లబ్ధి కలిగిస్తున్నాం. 

+ నాడు 39 లక్షల మందికే పింఛన్లు..
పెన్షన్లు తీసుకున్నా.. రేషన్‌ కార్డులు తీసుకున్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కంటే లబ్ధిదారుల సంఖ్య, ఇస్తున్న డబ్బుల్లో ఎంతో తేడా ఉంది. ఉదాహరణకు టీడీపీ హయాంలో అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చిన పింఛన్లు చూస్తే ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకు కేవలం రూ.1,000 మాత్రమే ఇచ్చారు. అది కూడా ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. గత సర్కారు ప్రతి నెలా ఫించన్ల కోసం వెచ్చించిన సొమ్ము కేవలం రూ. 400 కోట్లు మాత్రమే.

+ నేడు ఇంటికే 61 లక్షల పెన్షన్లు
గతంలో 39 లక్షల పింఛన్లు ఈరోజు మన హయాంలో 61 లక్షలకుపైగా పెరిగాయి. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.వెయ్యి మాత్రమే ఉన్న పింఛన్‌ను అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2,250కి పెంచాం. ఇవాళ నెలకు ఏకంగా రూ.1,450 కోట్లను ఒక్క పించన్ల పథకం కోసమే మన ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అదికూడా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్కరి ఆత్మాభిమానం దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో వలంటీర్లే ఇంటికొచ్చి వేకువనే తలుపుతట్టి గుడ్‌మార్నింగ్‌ చెప్పి చిరునవ్వుతో చేతిలో డబ్బులు పెట్టి వెళ్లిపోతున్నారు. ఇంత గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొత్త సంవత్సరంలో 1వ తేదీ నుంచి రూ.2,250 పింఛన్‌ కాస్తా  రూ.2,500 అవుతుంది.

+ గిట్టని వారికి ఎగ్గొట్టారు
గత ప్రభుత్వం తమకు గిట్టని వారికి పథకాలు ఎగ్గొట్టేందుకు, లంచాలు గుంజేందుకు జన్మభూమి కమిటీలను నియమించింది. ఇప్పుడు మనందరి ప్రభుత్వం మనకు ఓటు వేయని వారికి కూడా అర్హులైతే చాలు ప్రయోజనం చేకూరుస్తోంది. సామాజిక తనిఖీల కోసం లబ్ధిదారుల జాబితాను ప్రదర్శిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం.

+ ఆ రోజుకి, ఈ రోజుకి ఎంత తేడా..
గతంలో సంక్షేమ పథకాల కోసం ఆత్మాభిమానాన్ని చంపుకుని వృద్ధులు, దివ్యాంగులు, అక్కచెల్లెమ్మలు కాళ్లరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉండేది. ఈ రోజుకి, ఆ రోజుకు ఎంత తేడా ఉందో గమనించమని కోరుతున్నా. ఇవాళ వివక్ష, లంచాలకు తావులేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతోంది. కోవిడ్‌ సమయంలో ప్రభుత్వ రాబడి తగ్గినప్పటికీ పేదల విషయంలోమన ప్రభుత్వం మానవత్వం చూపుతోంది. 31 నెలల పాలన తర్వాత మరో 9,30,809 మంది లబ్ధిదారులకు మేలు చేస్తూ దాదాపు రూ.703 కోట్లను వివిధ కారణాలతో సమయానికి దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. పేదలపై మమకారం, బాధ్యతతో ఈ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. 
 
+ ఇదే నిదర్శనం..
పథకాలను ఎలా ఎగ్గొట్టాలి?.. పేదలను ఎలా ఎండగట్టాలి? డబ్బులు ఎలా మిగుల్చుకోవాలనేది గత సర్కారు విధానమైతే..  ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ఎలా మేలు చేయాలన్నది మన ప్రభుత్వ విధానం. ఈరోజు మనం అందిస్తున్న సహాయం, న్యాయం అందుకు నిదర్శనం.

మిగిలిపోయిన అర్హులకు మేలు ఇలా..
+ అదనంగా 2,86,059 మందికి రైతు భరోసా వైఎస్సార్‌ రైతు భరోసా 2021 రెండో విడత కింద 2,86,059 మంది రైతన్నల ఖాతాలకు రూ.58.89 కోట్లను జమ చేస్తున్నాం. ఇప్పటివరకు 52.38 లక్షల రైతు కుటుంబాలకు రైతు భరోసా ద్వారా రూ.17,030 కోట్లు అందచేశాం. తాజాగా ఇస్తున్న మొత్తం దీనికి అదనం. 

+ వైఎస్సార్‌ చేయూత
వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా మరో 2,50,929 మంది లబ్ధిదారులకు రూ.470.49 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. 45–60 ఏళ్ల వయసున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రెండేళ్లలో రూ.8,944 కోట్లు అందించాం. కొత్త లబ్ధిదారులు దీనికి అదనం.

+ వైఎస్సార్‌ సున్నావడ్డీ
అన్నదాతలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల వర్తింపులో భాగంగా 2019–20 రబీకి సంబంధించి మరో 62,622 మంది లబ్ధిదారులకు  రూ.9.01 కోట్లను జమ చేస్తున్నాం. 2020 ఖరీఫ్‌కు సంబంధించి మరో 58,821 మందికి రూ.10.06 కోట్లను జమ చేస్తున్నాం.  గత 30 నెలల్లో సున్నా వడ్డీ పంట రుణాలను గత సర్కారు బకాయిలతో కలిపి 58.97 లక్షల మంది రైతులకు రూ.1106 కోట్లు అందించాం. ఇప్పుడు అందిస్తున్నది అదనం.

+ 60 వేల మంది అక్కచెల్లెమ్మలకు అదనంగా..
పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపజేస్తూ మరో 59,661 మంది లబ్ధిదారులకు రూ.53.51 కోట్లను జమ చేస్తున్నాం. గత 30 నెలల వ్యవధిలో 98 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మలకు రూ.2,354 కోట్లను వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద అందించాం. ఇప్పుడు దాదాపు మరో 60 వేల మందికి అదనంగా మేలు చేకూరుస్తున్నాం.

+ జగనన్న వసతి దీవెన
జగనన్న వసతి దీవెన పథకం ద్వారా మరో 43,010 మంది విద్యార్ధులకు రూ.39.82 కోట్లు అందిస్తున్నాం. గత 30 నెలల్లో 18.78 లక్షల మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరుస్తూ 16.80 లక్షల మంది తల్లుల ఖాతాలకు రూ.2267 కోట్లు జమ చేశాం. ఇప్పుడు మరో 43 వేల మందికిపైగా అదనంగా సాయం అందుతోంది.
 
+ జగనన్న విద్యాదీవెన
జగనన్న విద్యాదీవెన పథకాన్ని అందుకోకుండా మిగిలిపోయిన మరో 31,940 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.19.92 కోట్లను జమ చేస్తున్నాం. గత 30 నెలల్లో 21.55 లక్షల విద్యార్ధులకు సంబంధించి 19.2 లక్షల మంది తల్లులకు రూ.6,258 కోట్లు అందించాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం మనమే చిరునవ్వుతో స్వీకరించి ఇచ్చాం. ఇప్పుడు దాదాపు మరో 32 వేల మందికి మేలు చేస్తున్నాం.

+ కాపు నేస్తం..
వైఎస్సార్‌ కాపు నేస్తం పథకంలో మరో 12,983 మందికి రూ.19.47 కోట్లు జమ చేస్తున్నాం. గత 30 నెలలుగా 3.27 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.982 కోట్లు అందచేశాం. ఇప్పుడు దాదాపు మరో 13 వేల మందికి సుమారు రూ.20 కోట్లు అదనంగా ఇస్తున్నాం.

+ వాహనమిత్ర..
వైఎస్సార్‌ వాహనమిత్ర పథకంలో మిగిలిపోయిన 8,080 మంది లబ్ధిదారులకు ఇవాళ రూ.8.8 కోట్లు జమ చేస్తున్నాం. గత 30 నెలల కాలంలో 2.74 లక్షల మందికి రూ.762 కోట్లు ఇచ్చి వాహనమిత్ర ద్వారా మంచి చేశాం. ఇవాళ ఇస్తున్నది దీనికి అదనం.

+ వైఎస్సార్‌ మత్స్యకార భరోసా
వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద 3,788 మందికి రూ.3.79 కోట్లను ఇప్పుడు అదనంగా జమ చేస్తున్నాం. గత 30 నెలల్లో 1.20 లక్షల మందికి రూ.332 కోట్లు అందచేశాం. 

+ వైఎస్సార్‌ ఆసరా..
వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా మరో 1,136 మందికి రూ.7.67 కోట్లను జమ చేస్తున్నాం. గత 30 నెలల కాలంలో 78.76 లక్షలమంది అక్కచెల్లెమ్మలకు రూ.12,750 కోట్లను అందచేశాం. తాజా సాయం దీనికి అదనం. 

+ నేతన్న నేస్తం..
వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకంలో మిగిలిపోయిన మరో 794 మంది లబ్ధిదారులకు రూ.1.91 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. గత 30 నెలల్లో 82 వేల మంది లబ్ధిదారులకు రూ.576 కోట్లు అందించగా ఇప్పుడు ఇస్తున్నది దీనికి అదనం.

+ ఇళ్ల పట్టాలు
90 రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మరో 1,10,986 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తున్నాం. గతంలో ఇచ్చిన 31 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలకు ఇది అదనం.

+ మరో లక్షన్నర పింఛన్లు..
అర్హులైన మరో 1,51,562 మందికి పెన్షన్‌ కార్డులు అందజేస్తున్నాం. దీంతో రాష్ట్రంలో పెన్షన్‌ కార్డుదారుల సంఖ్య 61,74,593కు చేరింది.  3,249 మందికి కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డులు అందజేస్తున్నాం. వీటితో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డుదారుల సంఖ్య 1,40,45,491కు పెరిగింది.

+ హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి(రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, బీసీ సంక్షేమశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.అనంతరాము, గృహ నిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ.కృష్ణబాబు, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, గ్రామ, వార్డు సచివాలయాల కమిషనర్‌ షాన్‌ మోహన్, మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు, మెప్మా ఎండీ విజయలక్ష్మి, స్త్రీనిధి ఎండీ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలను అందుకోలేని అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే వారందరికీ మంచి జరుగుతుంది. ప్రతి సంవత్సరం జూన్, డిసెంబరులో అంటే ఏడాదికి రెండు దఫాలు వారికి ప్రయోజనం చేకూరుస్తాం. డిసెంబరు నుంచి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత ఉండి కూడా లబ్ధి పొందని వారికి జూన్‌లో అందచేస్తాం. ఇక జూన్‌ నుంచి నవంబరు వరకు అమలైన పథకాలకు అర్హులైన వారికి డిసెంబరులో ప్రయోజనం కల్పించే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అది కూడా ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత పారదర్శకంగా సామాజిక తనిఖీల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శిస్తాం.
– సీఎం జగన్‌
 

ముందే సంక్రాంతి 
మాకు వైఎస్సార్‌ ఆసరా రెండు విడతలు రాకపోవడంతో నిరుత్సాహపడ్డాం. కానీ మీరు  సూచించినట్లుగా నెల రోజుల్లో మరోసారి దరఖాస్తు చేసుకోవడంతో రెండు విడతల డబ్బు రూ.1.52 లక్షలు వచ్చింది. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజే సంక్రాంతి పండుగ అన్నంత ఆనందంగా ఉంది.   
– ఝాన్సీరాణి, లబ్ధిదారు, కొంతమూరు, తూర్పుగోదావరి జిల్లా 

  

Advertisement
Advertisement