బీజేపీకి ఝలక్‌.. టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి | The alliance that shared Rajya Sabha seats | Sakshi
Sakshi News home page

బీజేపీకి ఝలక్‌.. టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి

Jun 5 2026 5:34 AM | Updated on Jun 5 2026 6:07 AM

 The alliance that shared Rajya Sabha seats

టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి 

రాజ్యసభ స్థానాలు పంచుకున్న కూటమి.. ఎన్డీయే సమావేశం నిర్ణయాలు వెల్లడించిన నేతలు  

టీడీపీ తరఫున సానా, రాజేష్‌ పేర్లు ఖరారు? 

పై ఇద్దరిలో ఒక్కరికే చాన్స్‌ ఇవ్వాల్సి వస్తే తెరపైకి మరికొన్ని పేర్లు    

జనసేన తరఫున లింగమనేని! 

నేడు ప్రకటించే అవకాశం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో టీడీపీ మూడు, జనసేన ఒక స్థానం కేటాయించుకున్నాయి. నాలుగింటిలో బీజేపీకి ఒక్క స్థానం ఇస్తారని ప్రచారం జరిగినా.. అది జరగలేదు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గురువారం జరిగిన ఎన్డీయే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రాజ్యసభ స్థానాల కేటాయింపు, రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. 

అనంతరం ఆ వివరాలను పల్లా, మాధవ్, నాదెండ్ల కలిసి మీడియాకు వివరించారు. మూడు స్థానాలు టీడీపీ, ఒక స్థానం జనసేనకి కేటాయించాలని నిర్ణయించినట్టు చెప్పారు. జనసేన రాజ్యసభ అభ్యర్థిని పవన్‌కళ్యాణ్‌ ప్రకటిస్తారని మనోహర్‌ చెప్పారు. టీడీపీ, జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకీ ఉన్నట్టేనని మాధవ్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై 9న తిరుపతి, 12న అమరావతి, 15న విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13, 16, 17, 18, 19, 20 తేదీల్లో జిల్లాల్లో రెండేళ్ల పాలనపై కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని, త్వరలో షెడ్యూల్‌ విడుదల చేస్తామని తెలిపారు. ‘సర్‌’ గురించి కూడా సమావేశంలో చర్చించినట్టు చెప్పారు.  

గతంలో రెండు, రెండు 
గతంలో నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ అయినప్పుడు టీడీపీ, బీజేపీ రెండు చొప్పున పంచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఖాళీ అవుతున్న నాలుగింటిలో మూడు తమ పార్టీకి కేటాయించాలని చంద్రబాబు ప్రతిపాదించినట్టు తెలిసింది. గతంలో తమకు ఒక స్థానం కూడా దక్కలేదు కాబట్టి ఈసారి అవకాశం ఇవ్వాలని పవన్‌కళ్యాణ్‌ కోరడంతో జనసేనకు ఒక స్థానం కేటాయించారు. 

టీడీపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కుతుండడంతో సానా సతీష్, కిలారు రాజేష్  కు ఇవ్వాలని ఈ సమావేశంలో లోకేశ్‌ చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ సతీష్, రాజేష్‌లలో ఒకరికే అవకాశం ఇవ్వాలని నిర్ణయిస్తే కంభంపాటి రామ్మోహనరావు, భాష్యం రామకృష్ణ, డాక్టర్‌ దేవయ్య, ఓ మహిళా నేతల్లో ఒకరికి చాన్స్‌ ఉండొచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు. గురువారం రాత్రి అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేయనున్నారు. జనసేనకు దక్కనున్న ఒక స్థానాన్ని పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు ఇవ్వనున్నట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement