60 ఏళ్లు.. సగర్వంగా మన ‘ఆంగ్రూ’ | Acharya NG Ranga Agricultural University is gearing up for the Diamond Jubilee celebrations. | Sakshi
Sakshi News home page

60 ఏళ్లు.. సగర్వంగా మన ‘ఆంగ్రూ’

Apr 27 2025 6:19 AM | Updated on Apr 27 2025 6:19 AM

Acharya NG Ranga Agricultural University is gearing up for the Diamond Jubilee celebrations.

వజ్రోత్సవాలకు ముస్తాబవుతున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 

29, 30 తేదీల్లో 60 ఏళ్ల పండుగకు సర్వం సిద్ధం

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) 60 ఏళ్ల పండుగకు ముస్తాబయ్యింది. ఈ నెల 29, 30 తేదీల్లో ఈ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ  60 ఏళ్ల సాధించిన పురోగతిపై ప్రత్యేక కథనం..

సాక్షి, అమరావతి: స్వాతంత్ర్యానంతరం రెండో జాతీయ విద్యా కమిషన్‌ సిఫార్సు మేరకు రాష్ట్రానికో వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రాతిపదికన ఏర్పాటైన తొలి యూనివర్సిటీ ఇది. ఈ వర్సిటీ పరిధిలో ప్రస్తుతం ఏడు ప్రభుత్వ వ్యవసాయ, 6 అనుబంధ, 2 ఫుడ్‌ సైన్స్, 2 అగ్రి ఇంజనీరింగ్, ఒక కమ్యూనిటీ సైన్స్, 19 ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్, 62 ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. 

ఏటా 45 వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు.   అరవై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వర్సిటీ ఎన్నో విజయాలు సాధించింది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి.. రెట్టింపు ఆదాయం లక్ష్యంగా ఏటా పదుల సంఖ్యలో కొత్త రకాలను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. తెగుళ్లు, కీటకాలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను తట్టుకునే వంగడాలు అభివృద్ధి చేయడమే కాకుండా,  సన్న రకాల సృష్టికర్తగా ఖ్యాతి గడించింది. ఫలితంగా దశాబ్దాలుగా వరి వినియోగంలో వర్సిటీ రకాలు తమ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి.  

కీర్తి కిరీటంలో ఆణిముత్యాలు.. 
» దేశంలో మూడో వంతు ప్రజలు ఆహారంగా తింటున్న వరి రకాలను అభివృద్ధి చేసిన ఘనత ఆంగ్రూకు దక్కుతుంది.  దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు..తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పది మందిలో తొమ్మిది మంది తినే ఆహార గింజలను వర్సిటీ సృష్టించింది.  
»  60 ఏళ్లలో 503 వంగడాలను వర్సిటీ  శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిలో ప్రధానంగా చిరుధాన్యాలు, ధాన్యాలు 217, అపరాలు 84, నూనె గింజలు 56, వాణిజ్య పంటలు 89, ఉద్యాన పంటలు 54లతో పాటు రెండు పశుగ్రాస, ఒకటి బయో డీజిల్‌ పంటలకు సంబంధించిన వంగడాలున్నాయి.  దేశంలోని 4.60 కోట్ల హెక్టార్ల  వరి విస్తీర్ణంలో 1.40 కోట్ల హెక్టార్లలో వర్సిటీ  రకాలే సాగవుతున్నాయి. 
»   ఏపీలో వర్సిటీ  వరి రకాలు 87 శాతం, నువ్వుల రకాలు 87.50 శాతం, వేరుశనగ రకాలు 95 శాతం, కందుల రకాలు 72 శాతం, చెరుకు రకాలు 62 శాతం, పప్పు ధాన్యాలు 36 శాతం విస్తీర్ణంలో సాగవుతున్నాయి.  
»  వర్సిటీ  అభివృద్ధి చేసిన వరి రకాలు ఏపీలో 74 శాతం, జాతీయ స్థాయిలో 25 శాతం విస్తీర్ణంలో సాగవడమే కాకుండా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఉగాండా, ఇథియోఫియా, కెన్యా వంటి దేశాల్లో కూడా సాగవుతున్నాయి.  
»   15 రాష్ట్రాలతో పాటు 150కు పైగా ప్రైవేటు విత్తన కంపెనీలకు బ్రీడర్‌ విత్తనాలను ఇస్తున్న ఏకైక వర్సిటీ కూడా ఇదే.  
»    వర్సిటీ  అభివృద్ధి చేసిన రకాలతో జాతీయ స్థాయిలో రూ.62,317 కోట్ల ఆదాయాన్ని రైతులు ఆర్జిస్తుండగా, ఏపీలో వర్సిటీ వరి రకాల ద్వారా రూ.20,243 కోట్లు, అపరాల ద్వారా రూ.2,113 కోట్లు, నూనె గింజల ద్వారా రూ.2,862 కోట్లు కలిపి మొత్తం రూ.25 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని రైతులు ఆర్జిస్తున్నారు.  
»   ఎగుమతుల్లో సింహ భాగమైన బాస్మతేతర బియ్యంలో మూడో­వంతు ఆంగ్రూ అభివృద్ధి చేసిన రకాలే. వీటి ద్వారా ఏటా 8–10 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్య ఆర్జన జరుగుతోంది.

జగన్‌ హయాం.. స్వర్ణ్ణయుగం
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో వర్సిటీ అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిచింది. అత్యాధునిక సౌకర్యాలు. అధునాతన భవనాలు సమకూర్చడంతో విస్తృత పరిశోధనలతో దూసుకెళ్లింది. డీజీసీఏ ఆమోదించిన డ్రోన్‌ శిక్షణ కేంద్రాన్ని గుంటూరు లాంలోని అప్సరా సెంటర్‌లో ప్రారంభించారు. పురుగు, తెగులు మందుల పిచికారికి ఆంగ్రూ పుష్పక్‌–1, విత్తనాలు, ఎరువుల పిచికారికి పుష్పక్‌ –2 డ్రోన్స్‌ను అభివృద్ధి చేశారు. 

10 పంటల్లో పిచికారీ చేసి సత్ఫలితాలను సాధించారు. జాతీయ స్థాయిలో డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ కోసం డీజీసీఏ సర్టిఫికేషన్‌ పొందిన తొలి వర్సిటీగా నిలిచింది. ఐసీఏఆర్‌ ర్యాంకింగ్స్‌లో 2022–23లో జాతీయ స్థాయిలో వర్సిటీ ఏడవ స్థానంలో నిలవగా, పీజీ అడ్మిషన్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. అన్ని ఇనిస్టిట్యూట్స్‌లలో 11వ స్థానంలో నిలిచింది.  

అగ్రిప్రెన్యూర్‌షిప్‌ ఓరియంటేషన్, ఇంక్యుబేషన్‌ ప్రోగ్రామ్‌ (సంకల్ప, 2021)లో 55 ఇంక్యుబేట్‌లు ఎంపికయ్యాయి. ఆర్‌ఎఆర్‌ఎస్‌– తిరుపతిలో అభివృద్ధి చేసిన మల్టీ టాస్క్‌ టూల్‌ బార్, నాప్‌సాక్‌ వీడర్‌లు వినూత్న వ్యవసాయ యంత్రాలుగా ఎంపికయ్యాయి. 2020లో రెండో అత్యధిక సంఖ్యలో ఐసీఏఆర్‌ పీజీ స్కాలర్‌షిప్‌లను పొందిన వర్సిటీగా ఐసీఏఆర్‌ నుంచి  జాతీయ అవార్డు దక్కింది. గిరిజన వ్యవసాయ వ్యవస్థల్లో అత్యుత్తమ పరిశోధన కోసం ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ అవార్డు–2020 వరించింది. 

వ్యవసాయ పరిశోధన, విద్యారంగ కేటగిరిలో  2022లో స్కాచ్‌ సిల్వర్,, స్కాచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డు సర్టిఫికెట్‌సహా ఎన్నో అవార్డులు వర్సిటీకి దక్కాయి. అలాంటి యూనివర్సిటీ 2024–25లో వ్యవసాయ వర్సిటీల్లో 26వ స్థానానికి, ఓవర్‌ ఆల్‌గా 151వ స్థానానికి దిగజారిపోయింది. 

ఎంతో గర్వంగా ఉంది
ఈ 60 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆంగ్రూ ఎన్నో విజయాలను సాధించింది. జాతీయ స్థాయిలో 40 శాతం మంది రైతులు ఆంగ్రూ రకాలు సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి రైతు వర్సిటీ రకాలపైనే ఆదారపడి వ్యవసాయం చేస్తున్నారు. ప్రతి ఏటా వరితో పాటు ఇతర పంటల్లో కూడా పెద్ద సంఖ్యలో కొత్త వంగడాలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాం. ఆంగ్రూ 60 ఏళ్లు పండుగ వేళ వీసీగా ఉండడం గర్వంగా ఉంది.  – డాక్టర్‌ శారదా జయలక్ష్మి దేవి, వైస్‌ చాన్సలర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement